-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp devarakonda rijerwayer raitulau
-
పరిహారం నిర్ణయించాకే భూములిస్తాం
ABN , First Publish Date - 2020-12-15T06:44:14+05:30 IST
దేవరకొండ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడాన్ని తప్పుబట్టడం లేదనీ, నష్టపరిహారం నిర్ణయించిన తరువాతే తాము భూములిస్తామని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి, పైలబోయలపల్లి రైతులు పేర్కొన్నారు.

దేవరకొండ రిజర్వాయర్ నిర్వాసిత గ్రామాల రైతులు
అనంతపురం, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): దేవరకొండ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడాన్ని తప్పుబట్టడం లేదనీ, నష్టపరిహారం నిర్ణయించిన తరువాతే తాము భూములిస్తామని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి, పైలబోయలపల్లి రైతులు పేర్కొన్నారు. నష్టపరిహారం నిర్ణయించకుండా భూములిచ్చేందుకు సిద్ధంగా లేమని వారు తేల్చిచెప్పారు. సోమవారం వారు.. కలెక్టరేట్కు వచ్చారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట తమ డిమాండ్లను ఏకరువు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి, సమస్యను విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ దేవరకొండ రిజర్వాయర్ నిర్మాణం పేరుతో తమ ప్రాంత రైతుల భూములు సర్వే చేస్తున్నారన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూములు సర్వే చేయటం ఏంటని ప్రశ్నించారు. తామంతా చిన్న, సన్న, మధ్యతరహా రైతులమన్నారు. ఆ భూములపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. రిజర్వాయర్ నిర్మాణం పేరుతో ఉన్న భూములను తీసుకుంటే తాము పూర్తిగా జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు, ఇళ్లు, పశువుల పాకలతో సహా యావత్ కోల్పోవాల్సి వస్తుందన్నారు. తమకు ఎక్కడా సెంటు స్థలం మిగిలే పరిస్థితి లేదన్నారు. భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే విషయంలో ఏ ధరలు నిర్ణయించారో.. అధికారులకే తెలియదంటుండటం విడ్డూరంగా ఉందన్నారు. తమ భూములు ప్రస్తుతం ఎకరాకు రూ.25 లక్షలు మార్కెట్ ధర పలుకుతోందన్నారు. ఈ నేపథ్యంలో సరైన నష్టపరిహారాన్ని నిర్ణయించిన తరువాతే రిజర్వాయర్ నిర్మాణానికి భూములిస్తామన్నారు. సీపీఎం హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి ఇంతియాజ్.. రైతులకు మద్దతు పలికారు. నష్టపరిహారం నిర్ణయించిన తరువాతే రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు.