గూడుపుఠాణి !

ABN , First Publish Date - 2020-06-23T09:52:40+05:30 IST

ధర్మవరం సబ్‌డివిజన్‌ పరిధిలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సి బ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులకు చు క్కలు ..

గూడుపుఠాణి !

ధర్మవరం, చెన్నేకొత్తపల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాల యాల్లో తలుపులు మూసి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది

కరోనా సాకుతో సామాన్యులకు తిప్పలు

బడాబాబులు రాగానే తెరుచుకుంటున్న తలుపులు

స్టాంపులు, ఈసీలు, రిజిస్ట్రేషన్‌ కోసం పడిగాపులు గాసిన సామాన్యులు

సిబ్బంది తీరుపై మండిపడ్డ ప్రజలు

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌తో వెలుగుచూసిన నిర్వాకం


ధర్మవరం/ చెన్నేకొత్తపల్లి, జూన్‌ 22 : ధర్మవరం సబ్‌డివిజన్‌ పరిధిలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సి బ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులకు చు క్కలు చూపిస్తున్నారు. రిజిస్ర్టేషన్‌తో పాటు ఏ చిన్న పని జరగాలన్నా జనం నానా తంటాలు పడాల్సిందే. ఇలాంటి ఆగడాలకు ధర్మవరం, చెన్నేకొత్తపల్లి సబ్‌ రిజిస్ర్టార్‌  కా ర్యాలయాలు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. వారి సొంత ప్రయోజనాల కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నా అడిగే దిక్కేలేరు. కార్యాలయంలో రియల్టర్లు, బడాబాబులకు అగ్రతాంబూలం ఇస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  సామాన్యులైతే ఒక న్యాయం. పెద్దలు(బడాబాబులు) అ యితే మరొక న్యాయమా...? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు కనుసైగ చేస్తే వారి పనులు చకచకా సాగిపోతుండగా, సామాన్యులైతే రోజుల తరబడి తిరిగినా పట్టించుకునే పాపాన పోవడం లేదని తెలుస్తోం ది.


విధులు నిర్వర్తించడంలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. చెన్నేకొత్తపల్లి, ధర్మవరం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలను సోమవారం మధ్యా హ్నం 12 గంటలకు ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేసింది ఆ సమయంలో అక్కడ సిబ్బంది కార్యాలయానికి తలుపులు వేసి లోపల విధులు నిర్వర్తించడం కన్పించింది. ఇదేమిటని పనుల కోసం వచ్చిన వారిని ఆరా తీయగా  ఉదయం నుంచి వేచిచూస్తున్నా తలుపులు వేసి ఉన్నాయని సమాధానం వచ్చింది.  వెంటనే కార్యాలయ సిబ్బందిని అడగ్గా, కరోనా, రెడ్‌జోన్‌ దృష్ట్యా ఇలా చేస్తున్నామని వారు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు, రెడ్‌జోన్‌ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదు. చెన్నేకొత్తపల్లిలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం పక్కనే ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ కార్యాలయాలు తలుపులు తెరుచుకుని పని చేస్తుండగా ఇక్కడేమో తలుపులు మూసి పనిచేయడంలో గూడుపుఠాణి ఏమిటని ప్రజలు ప్రశ్నించారు.


చాలామంది కార్యాలయానికి వచ్చి గంటల తరబడి పడిగాపులు గాశారు. స్టాంపులు, ఈసీలు, రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారు పని జరగదని తెలిసి నిరాశతో వెనుదిరగడం కన్పించింది. అయితే  కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాగానే తలుపులు ఠక్కున తెరుచుకోవడం గమనార్హం. దీన్ని ప్రత్యక్షంగా చూసిన సామాన్య ప్రజలు పెద్దలకోన్యాయం. మాలాంటి వారికి మరొక న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా  ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ నిలదీశారు. 


తలుపులు మూసి పని చేయాలనే నిబంధన లేదు : ఉమామహేశ్వరి, జిల్లా రిజిస్ర్టార్‌

విధి నిర్వహణలో కార్యాలయం తలుపులు మూసి పని చేయాలనే నిబంధనైతే ఏమీ లేదు. కరోనా విజృంభి స్తున్న వేళ తగిన భద్రతా చర్యలు తీసుకోవచ్చు. అక్కడ సిబ్బంది అలా భావించి ఉండవచ్చు. విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తా.

Updated Date - 2020-06-23T09:52:40+05:30 IST