మొదలైన అంగన్‌వాడీల ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-12-29T06:11:56+05:30 IST

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆరంభ మైంది. మొత్తం 855 పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు.

మొదలైన అంగన్‌వాడీల ఇంటర్వ్యూలు
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న జేసీ గంగాధర్‌గౌడ్‌, ఆర్డీఓ, పీడీ తదితరులు


అనంతపురం వైద్యం, డిసెంబరు 28: అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆరంభ మైంది. మొత్తం 855 పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. సోమవారం ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభించారు. తొలిరోజు ధర్మవరం, కదిరి, అనంతపురం డివిజన్లలో మొదలయ్యాయి. కదిరి ఈస్ట్‌, వెస్ట్‌ ప్రాజెక్టులతోపాటు పెనుకొండ ప్రాజెక్టు పరిధిలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల ఖాళీలకు కదిరిలో ఇంటర్వ్యూలు సాగాయి. జేసీ సిరి ఆర్డీఓ వెంకటరెడ్డిల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు చేపట్టారు. 9 ప్రధాన కార్యకర్త, 10 మినీ కార్యకర్త, 72 ఆయా పోస్టులు కలిపి మొత్తం 91 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 244 మందికిగాను 237 మంది హాజరయ్యారు. ధర్మవరం డివిజన్‌లోని ధర్మవరం, సీకేపల్లి, ముదిగుబ్బ, రాప్తాడు మండలాల పోస్టులకు ధర్మవరంలో ఇంటర్వ్యూలు చేపట్టారు. 117 కార్యకర్తలు, 22 మినీ కార్యకర్తలు, 65 ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 250 మంది అభ్యర్థులు పోటీ పడగా 233 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అనంతపురం డివిజన్‌ పరిధిలోని పో స్టులకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఇంటర్వ్యూలు చేశారు. జేసీ గంగాధర్‌గౌడ్‌, ఆర్డీఓ గుణభూషణ్‌ రెడ్డి, పీడీ విజయలక్ష్మి సమక్షంలో ఇంటర్వ్యూలు సాగాయి. కూడేరు ప్రాజెక్టు పరిధిలో 7 కార్యకర్త పోస్టులకు 22 మంది దరఖాస్తు చేసుకోగా అందరూ హాజరయ్యారు. 2 మినీ కార్యకర్తల పోస్టులకు 18 మందికిగానూ 100 శాతం హాజరయ్యారు. 35 ఆయా పోస్టులకు 111 మంది పోటీ పడగా ఇంటర్వ్యూలకు 106 మంది వచ్చారు. ఉరవకొండ ప్రాజెక్టు పరిధిలో మూడు ప్రధాన కార్యకర్తల పోస్టులకు 22 మందికిగాను 19 మంది హాజరయ్యారు. 31 ఆయా పోస్టులకు 98 మంది దరఖాస్తు చేయగా 92 మంది వచ్చారు. అనంతపురం అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో 5 ప్రధాన కార్యకర్తల పోస్టులకు 99 దరఖాస్తులు రాగా 92 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 40 ఆయా పోస్టులకు 337 మందికిగాను 224 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని పీడీ విజయలక్ష్మి తెలిపారు.


నేడు అనంతపురం, కళ్యాణదుర్గం డివిజన్లకు..  

అంగన్‌వాడీ ఇంటర్వ్యూలు మంగళవారం అనంతపురం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో ఉన్న పోస్టులకు కొనసాగుతాయని ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం డివిజన్‌ పరిధిలో సోమవారం మూడు ప్రాజెక్టులకు ముగిశాయని మిగిలిన గుత్తి, శింగనమల, తాడిపత్రి ప్రా జెక్టుల పోస్టులకు కొనసాగుతాయన్నారు. కాల్‌ లెటర్స్‌ అందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని పీడీ కోరారు.


Updated Date - 2020-12-29T06:11:56+05:30 IST