కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2020-09-03T10:44:44+05:30 IST
కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు...

కూడేరు, సెప్టెంబరు 2 : కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఏసీబీ సీఐ ప్రభాకర్ నేతృత్వంలో 10 మంది సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆన్లైన్లో భూముల నమోదు, ఈ-పాస్ బుక్ పంపిణీలో నిర్లక్ష్యం, భూముల సర్వేలో నిర్లక్ష్యం తదితర అంశాలపై కాల్ సెంటర్ 14400కు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు ఏడు గంటల పాటు సీఐ ప్రభాకర్ సిబ్బంది స్పందన మీసేవ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. రైతులు ఇచ్చిన అర్జీలపై విచారణ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో అర్జీలు పెండింగ్లో ఉండటం, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అందులో కూడేరు మండలంలో ఫిర్యాదులు అధికంగా ఉన్నా యన్నారు. ఏడాది కాలంగా రైతులు మీ-సేవలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అర్జీలను పరిశీలిస్తే... కూడేరులో నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఆయన వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. రైతులకు అందాల్సిన ఈ-పాస్ బుక్కులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.