నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి డిస్మిస్!
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:38 PM
మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో పన్నుల వసూళ్ల ద్వారా వచ్చిన రూ.25లక్షల నగదు దుర్వినియోగంపై ఆడిట్ అధికారుల నివేదిక ఆధారంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
విధుల నుంచి తప్పించిన మున్సిపల్ కమిషనర్
బల్దియాలో రూ.25లక్షల కుంభకోణం కొలిక్కి
మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 28 : మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో పన్నుల వసూళ్ల ద్వారా వచ్చిన రూ.25లక్షల నగదు దుర్వినియోగంపై ఆడిట్ అధికారుల నివేదిక ఆధారంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనికి బాధ్యులుగా మున్సిపల్ సిటీజెన్ సెంటర్లో పనిచేస్తున్న దివ్య అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ రాజిరెడ్డి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. 2024 మార్చిలో మున్సిపల్ కార్యాలయం లో జిల్లా ఆడిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పన్నుల వసూలు చేయగా వచ్చిన రూ.25లక్ష లెక్క తేలలేదు. ఈ మొత్తం దుర్వినియోగం చేశారని అప్పట్లోనే తేల్చారు. ఆడిట్ అధికారుల సూచనలతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు రూ.20లక్షల వరకు గతంలో మున్సిపల్ మేనేజర్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్, ప్రస్తుత మేనేజర్ శ్రీదేవిల నుంచి రికవరీ చేశారు. మరో నాలుగు లక్షల పైచిలుకు డబ్బు వివరాలు తేలకపోవటంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగి దివ్యను బాధ్యురాలిగా చేస్తూ మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణానంతరం రూ.25లక్షలు మొత్తం రికవరీ చేసినా కార్యాలయ డబ్బును సొంతానికి వాడుకున్న దివ్యను డిస్మిస్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.