ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:06 PM
కుకునూరుపల్లి, ఏప్రిల్ 27: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ సూచించారు.
హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ సూచన
కుకునూరుపల్లి, ఏప్రిల్ 27: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ సూచించారు. శనివారం కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఐపీవోపీ ల్యాబ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిని పరిశీలించారు. ఏప్రిల్లో జరిగిన ప్రసూతి, ఫార్మసీలో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు స్టాక్ మెయింటనెన్స్ ఉండాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు అందుతున్నాయా.. అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బతో ఆస్పత్రికి వచ్చిన రోగితో మాట్లాడుతూ ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో, వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ మలేరియా, టీబీ, కుష్ఠు రోగులకు ఇచ్చే మందులు, సేవలు, ఆస్పత్రిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట డీఎంహెచ్ఓవో పీ.శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ఏవో రవీందర్, వైద్యులు బల్వీర్సింగ్, నమ్రిత్ పలువురు సిబ్బంది ఉన్నారు.