Share News

రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:24 PM

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు.

రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు
ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌, అధికారులు

- అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు

- గద్వాల, ఇటిక్యాలల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 26 : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు. గద్వాల, ఇటిక్యాల మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మద్దత ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోళ్ళను వేగవంతం చేయాలని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుతున్న దృష్ట్యా రైతులకు టెంట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఏపీఎం, సీసీలను ఆదేశించారు. నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని, తేమ శాతం తక్కువగా ఉండేట్లు చూసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో నర్సింగరావు, జిల్లా వ్యవసాయధికారి గోవింద్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:24 PM