ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి
ABN , Publish Date - May 08 , 2024 | 11:12 PM
ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారెంటీలను వివరించాలని కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.
- పార్లమెంట్ ఎన్నికలు కోస్గి నాయకులకు విషమ పరీక్ష
- కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి
కోస్గి రూరల్, మే 8 : ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారెంటీలను వివరించాలని కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం కోస్గి మునిసిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన పాల్గొని మాట్లాడారు. కోస్గి మండలంలో నాయకులు ఎక్కువై, కార్యకర్తలు తక్కువయ్యారు. కార్యకర్తలను నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు కోస్గి నాయకులకు ఒక విషమ పరీక్ష అన్నారు. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా జరగరానిది జరిగి బీజేపీ గెలిచే పరిస్థితి వస్తే గత పదేళ్లలో జరగని గొడవలు, మత విద్వేశాలు గ్రామాల్లో మొదలవుతాయన్నారు. పాలమూరు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జరిగిందే.. తప్ప మరెప్పుడూ జరగలేదన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడని, అసెంబ్లీ ఎన్నికల కన్న ఇప్పుడు కోస్గి మండలంలో మెజార్టీ వస్తేనే ఏదైన అభివృద్ధి పనులు జరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కోస్గిలో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఇక ముందు అది జరగాలంటే కోస్గి మండలంలో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ రావాలన్నారు. పాలమూరు ఎంపీ గెలవాలంటే కొడంగల్లో మెజార్టీ రావాలని అందురు కొడంగల్ వైపు చూస్తున్నారన్నారు. ముఖ్యంగా కోస్గి మునిసిపాలిటీలో నాయకుల నిర్లక్ష్యం కనబడుతోందని, ఒకరికొకరు సహకరించడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం మండలంలోని కడంపల్లి, కోస్గికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, పీఏసీఎస్ మెంబర్ విజయ్ కుమార్, మునిసిపల్ పార్టీ అధ్యక్షుడు బెజ్జు రాములు, మునిసిపల్ ఫ్లోర్ అధ్యక్షుడు గోవర్దన్రెడ్డి, నాయకులు నాగులపల్లి నరేందర్, అన్న కిష్టప్ప, హరి పాల్గొన్నారు.