టీ ఫైబర్ సేవలు అందేదెన్నడో?
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:15 AM
: గ్రామ పంచాయతీల్లో పేపర్ రహిత సేవలం దించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం టీ ఫైబర్ నెట్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామంలో అమలవుతున్న పలు అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, ఖర్చు, పంచాయతీ సిబ్బంది. జీత భత్యాలు, ఆదాయ వ్యయాలు, జనన, మరణ ధ్రువీ కరణ పత్రాల జారీ వంటివి డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు రావాలన్నదే టీ ఫైబర్ నెట్ ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు ఫైబర్ నెట్ సేవలను వినియోగంలోకి తీసుకురాక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్25: గ్రామ పంచాయతీల్లో పేపర్ రహిత సేవలం దించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం టీ ఫైబర్ నెట్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామంలో అమలవుతున్న పలు అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, ఖర్చు, పంచాయతీ సిబ్బంది. జీత భత్యాలు, ఆదాయ వ్యయాలు, జనన, మరణ ధ్రువీ కరణ పత్రాల జారీ వంటివి డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు రావాలన్నదే టీ ఫైబర్ నెట్ ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు ఫైబర్ నెట్ సేవలను వినియోగంలోకి తీసుకురాక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో ఎంపిక చేసిన క్లస్టర్ పంచాయతీలకు అందించిన కంప్యూటర్లు మూలన పడేయగా, పంచా యతీల్లో ఆన్లైన్ సేవలందించేందుకు ఫైబర్ నెట్ సేవలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా పైపులైన్ వేసే సమయంలో టీ ఫైబర్ కేబుల్ వేశారు. జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు ఫైబర్ లైన్ వేసినప్పటికీ ఇంటర్నెట్ కేబుళ్లు లింకేజీ చేయకపోవడంతో సాంకేతిక సేవలు పొందలేక పోతున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని 17పంచాయతీలకు సాంకేతిక సేవలందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2017లో టీ ఫైబర్ ఇంటర్నెట్ పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా అది ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి.
ప్రతి గ్రామ పంచాయతీకి అవసరమైన టీ ఫైబర్ పైపులైన్ వేసి కేబుల్ బిగించారు. రెండేళ్ల క్రితం కంప్యూటర్లు, ఇంటర్నేట్ పరికరాలు, విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్లేట్లను అందించారు. గతేడాది నుంచి సాంకేతిక సిబ్బంది గ్రామ పంచాయతీలకు వచ్చి ట్రయల్స్ నిర్వహిస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. గ్రామ పంచాయతీ పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి కార్యదర్శులు చేతి రాత రశీదులను జారీ చేస్తున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యా లయంలో ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. పంచాయతీల్లో ఫైబర్ నెట్ సేవలు ఉపయోగంలోకి వస్తే పంచాయతీ పరిధిలోనే అన్ని సేవలను ఉపయోగించుకోవచ్చు. వెంటనే ఫైబర్ సేవలను వినియోగంలోకి తేవాలని సంబంధిత అధికారులను మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.