Share News

Madhya Pradesh: ఓటేసిన బాలుడు!

ABN , Publish Date - May 10 , 2024 | 05:05 AM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.

Madhya Pradesh: ఓటేసిన బాలుడు!

మైనర్‌ కొడుకుతో తన ఓటును వేయించిన మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత

న్యూఢిల్లీ, మే 9: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. ఆ బాలుడు స్థానిక బీజేపీ నేత వినయ్‌ మెహర్‌ కుమారుడని గుర్తించారు. మంగళవారం వినయ్‌ మెహర్‌ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కుమారుడితో కలసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయన తనకు బదులుగా కుమారుడితో ఈవీఎంపై బీజేపీకి ఓటు వేయించారు. ఈ తతంగాన్నంతా తన ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.


దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘బీజేపీ.. ఎన్నికల కమిషన్‌ను పిల్లల ఆట వస్తువుగా మార్చేసింది. బీజేపీ నేత వినయ్‌ మెహర్‌ తన ఓటును కుమారుడితో వేయించారు. దీన్ని ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలోనూ పెట్టారు. అసలు పిల్లలను, మొబైల్‌ను పోలింగ్‌ బూత్‌లోకి ఎలా అనుమతించారు? దీనిపై ఏమైనా చర్యలుంటాయా?’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. అయితే ఈ వీడియోపై ఇంకా ఎన్నికల సంఘం స్పందించలేదు. ఇటు జిల్లా కలెక్టర్‌ కౌశలేంద్ర విక్రమ్‌ సింగ్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈనేపథ్యంలోనే ప్రిసైడింగ్‌ అధికారి సందీప్‌ సైనీని సస్పెండ్‌ చేయడంతో పాటు బీజేపీ నేత వినయ్‌ మెహర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Updated Date - May 10 , 2024 | 05:05 AM