Share News

ఎంపీడీవో తీరుపై సభ్యుల ఆగ్రహం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:25 AM

స్థానిక ఎంపీడీవో వై.భవాని తీరుపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీడీవో తీరుపై సభ్యుల ఆగ్రహం

గంట్యాడ: స్థానిక ఎంపీడీవో వై.భవాని తీరుపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పీరుబండి హైమావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మదనాపురం ఎంపీటీసీ సభ్యులు కళ్లెంపూడి శేఖర్‌ మాట్లాడుతూ ఎంపీడీవో ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని, ఫోన్‌ కూడా ఎత్తడం లేదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో ‘మీరు ఎవరు’ అని ప్రశ్నించారు. ‘ఎంపీటీసీ సభ్యులు కూడా తెలియదా?’ అంటూ శేఖర్‌ తిరిగి ప్రశ్నించారు. రేగుబిల్లి ఎంపీటీసీ సభ్యులు అవతారం కూడా ఎంపీడీవో తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభ్యులు కూడా ఆమె తీరుపై మండిపడ్డారు. ఎంపీడీవో కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో... ఎప్పుడు ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా విధుల్లో ఉన్నా.... ఇప్పటి వరకూ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తెలియకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎంపీడీవో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా... సభ్యులు శాంతించలేదు. ఎన్నికల విధుల్లో ఉండడం వల్ల కాస్త బిజీగా ఉన్నామని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు వర్రి నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:25 AM