ఒత్తిళ్లే కారణమా?
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:35 AM
జిల్లాలో కొందరు వలంటీర్ల రాజీనామాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కొంతమంది ఎమ్మెల్వోలు, వైసీపీ నేతలు ఒత్తిళ్లే కారణమన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి.
సాలూరు రూరల్, ఏప్రిల్ 15: జిల్లాలో కొందరు వలంటీర్ల రాజీనామాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కొంతమంది ఎమ్మెల్వోలు, వైసీపీ నేతలు ఒత్తిళ్లే కారణమన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. తక్షణమే రాజీనామా చేయాలని కొద్దిరోజులుగా వలంటీర్ల ఫోన్లకు మెసేజ్లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ‘వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, ఇప్పుడు రాజీనామాలు చేసిన వారి బాధ్యత మాదే’ అని చెబుతున్నారు. మొత్తంగా నయానో..భయానో ఒప్పించి రాజీనామాలు చేయిస్తున్నట్లు సమాచారం. తాజాగా సోమవారం సాలూరు మండలంలో 68 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. జీగిరాం, కొత్తవలస, కూర్మరాజుపేట, నెలిపర్తి, నార్లవలస, ఖరాసవలస తదితర పంచాయతీలకు చెందిన వారు ఎంపీడీవో ఫణింద్రకుమార్కు రాజీనామా పత్రాల ను అందించారు. ఆ సమయంలో ఆయా వలంటీర్ల పక్కన సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, జీగిరాం ఎంపీటీసీ అల్లు సూరప్పలనాయుడు ఉండడం విశేషం. అంతేకాక వలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట రాజీనామా పత్రాలతో గ్రూప్ ఫొటో దిగినప్పుడు అక్కడే పెదపథం, జీగిరాం, నెలిపర్తి, ఖరాసవలస, కూర్మరాజుపేట వైసీపీ నేతలుండడం యాధృచ్ఛికమేనా అనే సందే హాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మరో 34 మంది సైతం రాజీనా మాలకు ముందుకొచ్చినా.. వారు ఇంకా ఎంపీడీవోకు పత్రాలను అందించలేదు. ఏదేమైనా తొలిరోజు మండలంలో వలంటీర్లు రాజీనామాల సంఖ్య ముందుగా వైసీపీ నేతలు ఆశించిన 102 మంది కాకుండా కేవలం 68 మంది దగ్గరే నిలిచి పోయింది. ఇదిలా ఉండగా మండలంలో ప్రధాన పంచాయతీలు, గిరిజన ప్రాంత, గిరిశిఖర పంచాయతీలకు చెందిన వారు ఎమ్మెల్వోల సందేశాలు, వైసీపీ నేతల ఒత్తిడికి తలొగలేదు. వారంతా రాజీనామాలకు ముందుకు రాలేదు.
24 మంది వలంటీర్ల తొలగింపు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలంలో నర్సిపురం, పెదబొండపల్లి గ్రామాలకు చెందిన 24 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించినట్టు ఎంపీడీవో షేక్ అహ్మద్ జావిద్ సోమవారం చెప్పారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగారావు ఇంటికి వెళ్లిన వలంటీర్లపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామ న్నారు. ఈ మేరకు 24 మంది వలంటీర్లను సర్వీసును నుంచి తొలగించినట్టు ఎంపీడీవో వెల్లడించారు.
మరికొందరు ముందస్తుగా రాజీనామాలు...
పార్వతీపురం మండలంలో పెద్దబొండపల్లి, నర్సిపురం గ్రామాలకు చెందిన కొందరు వలంటీర్లు ముందస్తుగానే రాజీనామాలు చేశారు. ఈ నెల 14న వారంతా వైసీపీ అభ్యర్థి జోగారావు ఇంటికి వెళ్లినట్లు అధికారులు గుర్తించి విచారణ ప్రారంభించారు. దీంతో ముందస్తుగానే ఆయా గ్రామాలకు చెందిన 26 మంది వలంటీర్లు సోమవారం రాజీనామాలు పత్రాలను ఎంపీడీవోకు అందించారు.