Share News

నామినేషన్ల దాఖలుకు ముహూర్తాలు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:43 AM

మరో రెండు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం పండితులను ఆశ్రయిస్తున్నారు.

నామినేషన్ల దాఖలుకు  ముహూర్తాలు!

బీజేపీ, వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థులు 24న నామినేషన్లు

18న సుందరపు, 19న అయ్యన్న, కన్నబాబురాజు, 21న అనిత..

అట్టహాసంగా నామినేషన్‌లు వేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు

18 నుంచి 25 వరకు స్వీకరణ

అనకాపల్లి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):

మరో రెండు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం పండితులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగో దశలో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో వివిధ రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా టీడీపీ-జనసేన- బీజేపీ కూటమితోపాటు వైసీపీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో తమ జాతకాలకు తగిన మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయంటూ పండితులను ఆశ్రయిస్తున్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కూటమి తరపున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ ఈ నెల 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయాలని ముహూర్తం పెట్టుకున్నట్టు తెలిసింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలు నాయుడు కూడా అదే రోజున (24వ తేదీ) నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ నెల 19న, ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్‌ 18న, వైసీపీ అభ్యర్థి రమణమూర్తిరాజు 19న నామినేషన్‌లు వేయనున్నారు. పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత 21వ తేదీన నామినేషన్‌ వేసి, 23న భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్‌ల స్వీకరణకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు వుంది.

Updated Date - Apr 16 , 2024 | 01:43 AM