పల్లెల్లో దోమల మందు పిచికారీ
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:41 AM
జిల్లాలో మలేరియా ప్రభావిత గ్రామాల్లో ముందస్తుగా దోమల మందు పిచికారీ పనులు చేపడతామని కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. మండలంలో చింతలవీధి పంచాయతీ ఉబ్బేటిపుట్టు గ్రామంలో సోమవారం ఆమె జెండా ఊపి స్ర్పేయింగ్ పనులను లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.
జిల్లాలో తొలి విడతగా 1,767 గ్రామాల్లో స్ర్పేయింగ్ పనులు
కలెక్టర్ ఎం.విజయసునీత
పాడేరు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా ప్రభావిత గ్రామాల్లో ముందస్తుగా దోమల మందు పిచికారీ పనులు చేపడతామని కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. మండలంలో చింతలవీధి పంచాయతీ ఉబ్బేటిపుట్టు గ్రామంలో సోమవారం ఆమె జెండా ఊపి స్ర్పేయింగ్ పనులను లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఆయా గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ పనులు పూర్తి చేయాలని మలేరియా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అలాగే వైద్యులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, మలేరియా సిబ్బంది సమన్వయంతో పని చేసి విజయవంతంగా పిచికారీ పనులు పూర్తి చేయాలన్నారు. మొదటి విడత స్ర్పేయింగ్ కార్యాచరణ ప్రకారం ఈ నెల 15 నుంచి 30వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 307 సచివాలయాలకు చెందిన 1,767 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేయాలన్నారు. లక్ష్యం మేరకు దోమల మందు పిచికారీ పనులు జరగాలని, అందుకు గ్రామస్థులు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి టీఎన్ఎస్ ప్రసాద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాధన, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.