Share News

మన్యం భగభగ

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:43 AM

మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో సోమవారం 40.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తరువాత నుంచి దాని తీవ్రత అధికమవుతున్నది.

మన్యం భగభగ
కొయ్యూరులో నిర్మానుష్యంగా ఉన్న వీధి

కొయ్యూరులో అత్యధికంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

పాడేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో సోమవారం 40.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తరువాత నుంచి దాని తీవ్రత అధికమవుతున్నది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై సంచరించేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. తాజా వేడి వాతావరణానికి ఏజెన్సీ వాసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుందనే వాతావరణశాఖ ప్రకటనలతో మన్యం వాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కొయ్యూరులో 40.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అనంతగిరిలో 35.4, అరకులోయలో 35.4, చింతపల్లిలో 37.1, డుంబ్రిగుడలో 36.5, జీకేవీధిలో 38.8, జి.మాడుగులలో 37.5, హుకుంపేటలో 34.0, ముంచంగిపుట్టులో 36.6, పాడేరులో 37.6, పెదబయలులో 36.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రహదారులు నిర్మానుష్యం

కొయ్యూరు: కొయ్యూరులో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ ప్రభావం చూపిస్తోంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతున్నది. ఉదయం 11 గంటలు దాటిన తరువాత రోడ్లపైకి రావడానికి జనం భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ అన్ని రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఎండ తీవ్రతతో పాటు వీస్తున్న వడగాడ్పులకు పూత, పిందెతో ఉన్న జీడిమామిడి తోటలు ఆకులు ఎండిపోతున్నాయి. పిందెలు రాలిపోతుండడంతో రైతాంగం నష్టపోతున్నది.

Updated Date - Apr 16 , 2024 | 12:43 AM