దర్జాగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:22 AM
మండలంలో పలు చోట్ల గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొండలను పిండి చేసి దర్జాగా గ్రావెల్ను తరలించుకుపోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
- మండలంలో పలు చోట్ల కొండలను గుల్ల చేస్తున్న అక్రమార్కులు
- జగనన్న లేఅవుట్లనూ వదలని వైనం
- అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పట్టించుకోని అధికారులు
సబ్బవరం, ఏప్రిల్ 28: మండలంలో పలు చోట్ల గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొండలను పిండి చేసి దర్జాగా గ్రావెల్ను తరలించుకుపోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
మండలంలోని రాయపుఅగ్రహారం, గాలి భీమవరం, పైడివాడ అగ్రహారం, అసకపల్లి, సబ్బవరం, వంగలి తదితర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని గంగవరం, నంగినారపాడు గ్రామాల పరిధిలో గల జగనన్న లేఅవుట్లు, వాటిని ఆనుకుని ఉన్న కొండవాలు ప్రాంతాల్లో దర్జాగా అనధికార తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వీఎంఆర్డీఏ, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. సబ్బవరం మండలానికి అనుకొని ఉన్న గాజువాక తలారివానిపాలెంలోని (సర్వే నంబర్లు 155, 156, 141) కొండలు, పరవాడ మండలం ఇ-మర్రిపాలెం, పెదముషిడివాడ గ్రామాల్లో ఉన్న కొండలను కూడా ఆక్రమార్కులు దర్జాగా తవ్వేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.