ఏలేరు పైప్లైన్ హుళక్కే!
ABN , Publish Date - Apr 16 , 2024 | 01:33 AM
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నందున నగరంలో 2050 వరకూ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏలేరు పైప్లైన్ ప్రాజెక్టుకు జీవీఎంసీ ప్రతిపాదించింది.
కాలువకు బదులుగా పైప్లైన్ నిర్మాణానికి జీవీఎంసీ యోచన
నీటి వృథాను అరికట్టేందుకు వీలుగా ప్రయత్నాలు
నగరంలో 2050 వరకూ తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదనలు
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,494 కోట్లు ఖర్చవుతుందని అంచనా
మూడేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి డీపీఆర్ నివేదన
ఇప్పటివరకు పట్టించుకోని జగన్ సర్కారు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నందున నగరంలో 2050 వరకూ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏలేరు పైప్లైన్ ప్రాజెక్టుకు జీవీఎంసీ ప్రతిపాదించింది. దీనిపై అంచనాలతోపాటు డీపీఆర్ తయారుచేసి పంపాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంజనీరింగ్ అధికారులు సర్వేచేసి ప్రాజెక్టుకు రూ.3,494 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసి, మూడేళ్ల కిందట ప్రభుత్వానికి డీపీఆర్ పంపించారు. అయితే ఇంతవరకూ ప్రాజెక్టుపై సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, భవిష్యత్తులో నగర జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి వనరులను పెంచుకునేందుకు జీవీఎంసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా నీటిని తరలిస్తున్న పద్ధతికి బదులుగా పైప్లైన్ వేసే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి నగరానికి 160 కిలోమీటర్లు పొడవున పైప్లైన్ నిర్మించాలంటే సుమారు రూ.3,949 కోట్లు వరకూ ఖర్చవుతుందని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీరు నగరానికి చేరుతుందని, ఇది 2050 వరకూ పెరిగే నగర జనాభా అవసరాలకు సరిపోతుందని పేర్కొంటూ డీపీఆర్ సిద్ధం చేశారు.
సర్కారు తీరుతో మూలకు...
ప్రస్తుతం నగరానికి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్, విజయనగరం జిల్లాలోని తాటిపూడి, దేవరాపల్లి మండలంలోని రైవాడ రిజర్వాయర్ నుంచి నీరందుతోంది. అయితే వీటి నుంచి నుంచి వ్యవసాయానికి కూడా నీటి కేటాయింపులు వుండడంతో వేసవిలో నీటి విడుదలకు సమస్యలు తలెత్తి నగరంలో నీటిసరఫరాపై ప్రభావం పడుతోంది. పైగా ఓపెన్ కెనాల్ ద్వారా నీరు ప్రవహించే సమయంలో ఎండవేడికి ఆవిరికావడం, కాలువ నుంచి నీటి చౌర్యం జరగడం, పైగా నీరంతా కలుషితం కావడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యమ్నాయ వనరులను సిద్ధం చేసుకునే క్రమంలో ఏలేరు నుంచి ప్రస్తుతం ఉన్న ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్లైన్ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. దీనికి అవసరమయ్యే రూ.3,494 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జల్శక్తి పథకం నుంచి 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు, ప్రపంచబ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల నుంచి రుణాల ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునేలా డీపీఆర్ తయారుచేసి మూడేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన తరువాత టెండర్లు పిలుస్తామని అప్పటి జీవీఎంసీ కమిషనర్ డాక్ట్టర్ జి.లక్ష్మీషా ప్రకటించారు.
మూడేళ్లైనా అతీగతీ లేదు...
మూడేళ్లయినా ప్రాజెక్టుపై ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ను ఆమోదిస్తున్నట్టుగానీ, సవరించాలని వెనక్కిపంపడం కానీ జరగలేదు. ఉద్యోగులకు ప్రతినెలా నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం జీవీఎంసీలో నీటిసరఫరా మెరుగుపరిచేందుకు ఏకంగా రూ.3,494 కోట్లు వెచ్చిస్తుందంటే అధికారులు ఎలా నమ్మారని జీవీఎంసీకి చెందిన కొంతమంది సిబ్బందే ప్రశ్నిస్తుండడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలే లేవని తేల్చి చెబుతోంది.