Share News

పెదబయలులో దారుణ హత్య

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:25 AM

మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేడపై నిద్రిస్తున్న అతనిని కత్తితో దారుణంగా హతమార్చిన సంఘటన పెదబయలులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనాపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజు(33), తన భార్య సరోజిని, ఇద్దరు పిల్లలతో కలిసి పెదబయలులోని తమ బంధువైన మాజీ సర్పంచ్‌ త్రినాథ్‌ కుమారుడి వివాహ వేడుకలకు ఈ నెల 26న పెదబయలు వెళ్లారు.

పెదబయలులో దారుణ హత్య
మృతుడు శోభ హేమరాజు(ఫైల్‌)

నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి

- హత్యకు వివాహేతర సంబంధమే కారణం?

- పరారీలో నిందితుడు

- గాలిస్తున్న పోలీసులు

పెదబయలు, ఏప్రిల్‌ 28: మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేడపై నిద్రిస్తున్న అతనిని కత్తితో దారుణంగా హతమార్చిన సంఘటన పెదబయలులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనాపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజు(33), తన భార్య సరోజిని, ఇద్దరు పిల్లలతో కలిసి పెదబయలులోని తమ బంధువైన మాజీ సర్పంచ్‌ త్రినాథ్‌ కుమారుడి వివాహ వేడుకలకు ఈ నెల 26న పెదబయలు వెళ్లారు. ఈ నెల 28న వివాహానికి సంబంధించిన విందు కార్యక్రమం ఉండడంతో హేమరాజు అక్కడే ఉన్నారు. శనివారం బంధువుల మేడపై హేమరాజు నిద్రిస్తున్న సమయంలో ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి ఆతనిని విచక్షణారహితంగా నరికేశాడు. హేమరాజు కేకలు వేయడంతో మేడపై వున్న వ్యక్తులతో పాటు చుట్టుపక్కన జనం అక్కడికి వచ్చారు. అయితే అతను తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్నాడు. దీంతో హుటాహుటిన అతనిని 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. హేమరాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు.

హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?

పాడేరు మండలం వర్తనాపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. శోభరాజు భార్య సరోజిని పెదబయలులో మహిళా పోలీస్‌గా పని చేసిన సమయంలో ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందరరావు భార్యతో హేమరాజు వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడని, ఈ విషయంపై గత రెండేళ్లుగా వివాదం కొనసాగుతున్నదని స్థానికులు అంటున్నారు. ఇదే విషయంపై హేమరాజు భార్యకు సుందరరావు పలుమార్లు ఫోన్‌ చేసి హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో వున్న అతను అదను చూసి హేమరాజును హతమార్చాడని భావిస్తున్నారు. కాగా హేమరాజు వివాహ వేడుకకు పెదబయలు వస్తాడని తెలుసుకున్న సుందరరావు పథకం ప్రకారం హత్య చేసి పరారయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండడంతో పెదబయలు పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ కేసు నమోదు చేయగా, జి.మాడుగుల సీఐ రమేశ్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:26 AM