ఎన్నికల విధులకు ఎన్సీసీ క్యాడెట్లు
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:20 AM
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను ఎన్నికల విధులకు వినియోగించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదే శించారు.
కలెక్టరేట్, ఏప్రిల్ 29: ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను ఎన్నికల విధులకు వినియోగించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదే శించారు. వచ్చే నెల 13న పోలింగ్ జరుగనున్న రోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో ఎస్పీ జీఆర్ రాధికతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,358 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఒక్కో కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున 18 ఏళ్లు నిండిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను వినియోగిస్తామన్నారు. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలన్నారు. వీరికి శాంతిభద్రతల పనులు అప్పగించబోమని, కేవలం ఓటరు సహాయం కోసం మాత్రమే వినియోగిస్తామన్నారు. ఎస్పీ జీఆర్ రాధిక మాట్లా డుతూ.. జిల్లాలో ఎన్సీసీ క్యాడెట్లు 852 మంది అందుబాటులో ఉన్నారని, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు 1774 మంది ఉన్నారన్నారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ త్రినాథరావు, ఎన్సీసీ ఏఎన్వో వై.పోలినాయుడు, 14వ ఎన్సీసీ బెటాలియన్ తరపున షేక్ కమాల్, జితేంద్ర కుమార్ పాల్గొన్నారు.