రాజీనామా చేయకుంటే పథకాలు నిలిపేస్తాం
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:29 AM
ఎన్నికల వేళ వైసీపీ నేతలు వలంటీర్లకు ఓ వైపు ఆఫర్ ఇస్తూనే.. మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
వలంటీర్లకు వైసీపీ నేతల బెదిరింపులు
మెళియాపుట్టి, ఏప్రిల్ 15: ఎన్నికల వేళ వైసీపీ నేతలు వలంటీర్లకు ఓ వైపు ఆఫర్ ఇస్తూనే.. మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మీరు మర్యాదగా రాజీనామా చేస్తే రెండు నెలల జీతం ముందే ఇస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్నే వలంటీర్లుగా కొనసాగిస్తాం. రాజీనామా చేయని వలంటీర్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపేస్తాం’ అని మెళియాపుట్టిలో స్థానిక వైసీపీ నాయకులు వలంటీర్లకు స్పష్టం చేశారు. దీంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 303 మంది వలంటీర్లు ఉండగా ఇప్పటివరకు కేవలం 55 మంది మాత్రమే రాజీనామా చేశారు. వైసీపీ నాయకులు బెదిరించి మరీ రాజీనామా చేసేలా వలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం వరకు 8 మంది రాజీనామా చేయగా.. సోమవారం ఒక్కరోజే స్థానిక ప్రజాప్రతినిధి దగ్గరుండి మరీ 47 మంది రాజీనామా చేయించడం చర్చనీయాంశమైంది.