ఆర్టీసీ బస్సులో రూ.29లక్షలు పట్టివేత
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:22 AM
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద రూ.29.50లక్షల నగదును సర్వేలైన్స్ బృందం పట్టుకుంది.
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 29ః ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద రూ.29.50లక్షల నగదును సర్వేలైన్స్ బృందం పట్టుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. విశాఖపట్నానికి చెందిన కలిదిండి వెంకటేశ్వర రాజు కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ఏసీ బస్సులో ఓ బ్యాగుతో ప్రయాణిస్తున్నాడు. శ్రీకాకుళం సింహద్వారం వద్ద సర్వేలైన్స్ అధికారులు బస్సును ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరాజు బ్యాగులో రూ.29.50లక్షల నగదు దొరికింది. దీనిపై వెంకటేశ్వరరాజును వివరణ కోరగా మెళియాపుట్టిలో ఏకలవ్య స్కూల్ నిర్మాణానికి ఈ నగదు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఆ నగదును సర్వేలైన్స్ బృందంలోని డిప్యూటీ తహసీల్దార్ నానిబాబు.. శ్రీకాకుళం తహసీల్దార్ రాణికి అందజేశారు. ఆ మొత్తాన్ని ట్రెజరీకి అప్పగించారు.
చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత
జి.సిగడాం: ఉల్లివలస చెక్పోస్టు వద్ద ఎటువంటి ఆధారాలు లేని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చీపురుపల్లి నుంచి రాజాం వైపు ఎలక్రికల్ స్కూటీపై వస్తు న్న నూరు జయరాంను తనిఖీ చేయగా అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేని రూ.75 వేల 500 స్వాధీనం చేసుకుని రణస్థలం ఆర్వోకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.