కూటమి అగ్రనేతలు వస్తున్నారు....
ABN , Publish Date - Apr 29 , 2024 | 01:27 AM
జిల్లాలో టీడీపీ కూటమి తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ప్రచారం నిర్వహించనున్నారు.
రేపు ఒంగోలుకు లోకేష్
కొండపి, ఎస్ఎన్పాడులో బాలకృష్ణ పర్యటన
2 లేదా 4 తేదీల్లో దర్శికి చంద్రబాబు
3న గిద్దలూరు, దర్శి, ఒంగోలులో పవన్ సభలు
ఒంగోలు, ఏప్రిల్ 28 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో టీడీపీ కూటమి తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ప్రచారం నిర్వహించనున్నారు. వారి పర్యటనలపై జిల్లాలోని ఇరు పార్టీల వర్గాలకు సమాచారం అందింది. ఆప్రకారం ఈనెల 30వతేదీన ఒంగోలుకు యువనేత నారా లోకేష్ రానున్నారు. నగరంలోని ఏ-1 కన్వెన్షన్ హాలు ఎదురు స్థలంలో సుమారు ఐదువేల మంది యువకులతో ఏర్పాటు చేస్తున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ ఆ కార్యక్రమం ఉంటుంది. అనంతరం నెల్లూరు వెళ్తారు. 30వ తేదీనే టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కొండపి నియోజకవర్గంలోని మర్రిపూడి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు దర్శి నియోజకవర్గానికి రానున్నారు. అయితే 3వతేదీ పవన్ కల్యాణ్ కార్యక్రమం ఉన్నందున ఈనెల 2 లేక 4వ తేదీల్లో చంద్రబాబు పర్యటించే అవకాశం ఉంది. మార్కాపురం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు కలిసొచ్చే విధంగా కూడలి ప్రాంతంలో సభ లేక దర్శిలో రోడ్షో కార్యక్రమంలో ఒకటి ఉండే అవకాశం ఉంది. ఇక టీడీపీ కూటమిలో ప్రధాన పాత్ర ధారైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మే 3వ తేదీన జిల్లాలో ఎన్నికల పర్యటనకు వస్తున్నట్లు సమా చారం. ఆరోజు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని గిద్దలూ రు, దర్శి, ఒంగోలుల్లో జరిగే సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. తొలుత గిద్దలూరు, మధ్యాహ్నం దర్శిలో జరిగే సభలకు ఆయన హాజరవుతారు. సాయంత్రం ఒంగో లులో రోడ్షోతో పాటు సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి మాగుంట పర్యవేక్షిస్తూ హెలిప్యాడ్ నిర్మాణ అనుమతులకు జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 30న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా జిల్లాకు వస్తున్నారు. ఆ రోజు ఉదయం టంగుటూరులో జరిగే సభలో ఆయన పాల్గొంటారు.