జగన్రెడ్డి పాలనకు వీడ్కోలు పలకండి
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన జగన్రెడ్డికి వీడ్కోలు పలకాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఐదు గ్రామాలలో జొన్నతాళి, చిమ్మిరిబండ, రాజుగారిపాలెం, డేగరమూడి, వలపర్ల గ్రామాలలో ఏలూరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
రాష్ట్రానికి రాజధాని లేదు..
పంటలకు నీరు కరువు..
మద్యం, ఇసుక వ్యాపారంతో దోపిడీ
అవినీతి, అరాచకం తప్ప
అభివృద్ధి శూన్యం టీడీపీ కూటమి
ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి
మార్టూరు, ఏప్రిల్ 28 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన జగన్రెడ్డికి వీడ్కోలు పలకాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఐదు గ్రామాలలో జొన్నతాళి, చిమ్మిరిబండ, రాజుగారిపాలెం, డేగరమూడి, వలపర్ల గ్రామాలలో ఏలూరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా, అన్నదాతకు సాగు నీరు రాకుండా చేసిన చేతగాని వ్యక్తి జగన్రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు మద్యం, ఇసుక, మట్టిని దోచుకొని కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. ఐదేళ్ల వారి పాలనలో అవినీతి..అరాచకాలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. అభివృద్ధి చేసినట్లు కరపత్రాలపై చూపడం.. ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప వాస్తవం లేదన్నారు. కనీసం నీటి ప్రాజెక్టులను కూడా కట్టకుండా రైతులను ముంచారన్నారని ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు. 20 శాతం పనులు చేస్తే పోలవరం పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలంగా మారేదన్నారు. గ్రామాలలో ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇలాంటి పాలకులకు సాగనంపాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరికి ఘన స్వాగతం
తొలుత జొన్నతాళి గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఏలూరికి టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. రామాలయం, పోలేరమ్మ దేవాలయం, గంగమ్మ గుడిలో ఏలూరి పూజలు చేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న ఏలూరికి మహిళలు తిలకం దిద్ది హారతులిచ్చారు. ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న ఏలూరి చి మ్మిరిబండ గ్రామంలో ప్రచారానికి వెళ్లగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి ఎస్సీ కాలనీలోని డాక్టరు బీఆర్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత రాజుగారిపాలెంలో, సెంటర్లో ప్రచారం రథంపై నుంచి ఏలూరి మాట్లాడారు. సాయంత్రం డేగరమూడి వచ్చిన ఏలూరికి బ్రహ్మరథం పట్టారు. పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. బాబును మళ్లీ రప్పిద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిద్దాం.. అంటూ మహిళలు పోస్టర్తో ఏలూరికి స్వాగతం పలికారు. రాత్రి వలపర్లలోని సినిమా హాలు సెంటరు, గరటయ్య కాలనీ, చేనేత కార్మికుల వీధులలో ఏలూరి స్థానిక నేతలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
యద్దనపూడి మండల వైసీపీకి షాక్
జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణమ్మ
50 కుటుంబాలతో టీడీపీలో చేరిక
ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి
యద్దనపూడి (మార్టూరు) : యద్దనపూడి మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ జడ్పీటీసీ సభ్యులు గన్నవరం గ్రామానికి చెందిన చుండి లక్ష్మీ నారాయణమ్మ తన వర్గీయులు 50 మందితో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆదివారం మండలంలోని ఏలూరి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో వారంతా చేరారు. వారందరికీ ఏలూరి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకునేవారంతా కూటమికి మద్దతు తెలపాలన్నారు. లక్ష్మీనారాయణమ్మతోపాటు కొల్లా రామయ్య, చుండి మురళి కృష్ణ, షేక్ జాన్ సైదా, పల్లెపోగు శ్రీ మాన్, పేరే చర్ల వీరరాఘవులు, బాజి, కాకాని మరియబాబు తదితరులు చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో గన్నవరం గ్రామానికి చెందిన నాయకులు నల్లపనేని రంగయ్య చౌదరి, పత్తిపాటి రాజేష్, చెరుకూరి సురేంద్ర, కొల్లా వినోద్, పత్తిపాటి వేణు బాబు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన కిషోర్కాలనీవాసులు
మార్టూరులోని కిషోర్ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీడీపీలో చేరారు. ఏలూరి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ హయాంలోనే కిషోర్ కాలనీ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే పూర్తిశాతం అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ప్రతాప్ అంజి, దార్ల తిరుపాలు, దార్ల రమేష్, దార్ల శ్రీను, పెడాల భిక్షాలు, పెడాల సత్తయ్య, పెడాల వెంకయ్య, పెడాల బుజ్జయ్య, పెడాల సత్యం, పెడాల శివ, పెడాల గురవయ్య, పెడాల అంకమ్మ, పెడాల తిరుపతమ్మ, పెడాల కోటమ్మ, పెడాల ఇజ్రాయేల్, పెడాల నాగేంద్రం, దార్ల గురవయ్య చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన ఆవుల తిరుపతయ్య ఉన్నారు. అదే విదంగా కోనంకి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొర్రపాటి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు.