Share News

బెల్లంకొండవారిపాలెంలో హైడ్రామా

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:54 PM

బెల్లంకొండవారిపాలెంలో నేతలు పార్టీ మారిన నేపథ్యంలో వైసీపీ వారు హైడ్రామాను సృష్టించారు. వైసీపీని వీడి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన ఆ గ్రామ నేతలపై అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి తెచ్చింది.

బెల్లంకొండవారిపాలెంలో హైడ్రామా
సర్పంచ్‌ భర్త శ్రీకాంత్‌రెడ్డికి బలవంతంగా వైసీపీ కండువా కప్పుతున్న బూచేపల్లి

టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్‌ భర్త, ఎంపీటీసీ భర్తపై తీవ్ర ఒత్తిడి

రెండుగంటలు తిష్టవేసి ఒకరికి పార్టీ కండువా కప్పిన బూచేపల్లి

తాళ్లూరు, ఏప్రిల్‌ 29: బెల్లంకొండవారిపాలెంలో నేతలు పార్టీ మారిన నేపథ్యంలో వైసీపీ వారు హైడ్రామాను సృష్టించారు. వైసీపీని వీడి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన ఆ గ్రామ నేతలపై అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఆదివారం బెల్లంకొండవారిపాలెం సర్పంచ్‌ భర్త పోశం శ్రీకాంత్‌రెడ్డి, దోసకాయలపాడు ఎంపీటీసీ సభ్యురాలు భర్త గూడా ప్రభాకర్‌రెడ్డి మరికొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాలు వైసీపీ నేతలను మింగుడుపడనియకుండా చేశాయి. 24 గంటలు గడవక ముందే వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి బలవంతంగా సోమవారం సాయంత్రం సర్పంచ్‌ సుమలత భర్త శ్రీకాంత్‌రెడ్డిను జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి తన వెంటబెట్టుకుని దర్శిలో బూచేపల్లి నివాసానికి తీసుకెళ్లి వైసీపీ కండువా కప్పారు.

గ్రామంలో ఆదివారం సాయంత్రం నుంచే వైసీపీ వారు బెల్లంకొండవారిపాలెం గ్రామ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ రోజు రాత్రి బూచేపల్లి వారిని తిరిగి వైసీపీలోనే కొనసాగాలని కోరినట్లు తెలిసింది. ఎంపీ మాగుంట సమక్షంలో టీడీపీలో చేరిన సర్పంచ్‌ భర్త పోశం శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భర్త గూడా ప్రభాకర్‌రెడ్డి, వారి అనుచరులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నేరుగా రంగప్రవేశం చేసి తూర్పుగంగవరంలో తిష్టవేసి రెండుగంటలపాటు పార్టీ వీడిన వారితో సంప్రదింపులు జరిపారు. శ్రీకాంత్‌రెడ్డి తండ్రి గంగిరెడ్డి తాము టీడీపీలో చేరామని తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రశ్నేలేదంటూ వారికి తెగేసి చెప్పినట్లు సమాచారం. జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డికి శ్రీకాంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు కావటంతో సాయంత్రం వరకు సర్పంచ్‌ ఇంటి వద్దే మకాం వేసి టీడీపీ కండువా కప్పుకున్న శ్రీకాంత్‌రెడ్డిని మళ్లీ ఒప్పించి సర్పంచ్‌ సుమలతతో పాటు ఇరువురిని దర్శిలోని బూచేపల్లి నివాసానికి తీసుకెళ్లి తిరిగి వైసీపీ కండువా కప్పించారు. ఆదివారం ఎంపీ మాగుంట సమక్షంలో టీడీపీలో చేరిన వారిలో సర్పంచ్‌ భర్త శ్రీకాంత్‌రెడ్డి ఒక్కరే వైసీపీ గూటికి తిరిగి చేరగా, మిగిలిన వారంతా టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టంగా చెప్పి మిన్నకుండి పోయినట్లు తెలిసింది.

Updated Date - Apr 29 , 2024 | 10:55 PM