విలీనం పేరుతో.. వెన్ను విరిచారు!
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:22 AM
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని వైసీసీ ప్రభుత్వం డబ్బా కొడుతోంది.. ఉద్యోగులను ఉద్ధరించామని చెబుతూనే సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది. విలీనం వల్ల దక్కాల్సినవి దక్కకపోగా.. గతంలో సాధించుకున్నవి కూడా కోల్పోవాల్సి రావటంతో ఆర్టీసీ ఉద్యోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని వైసీసీ ప్రభుత్వం డబ్బా కొడుతోంది.. ఉద్యోగులను ఉద్ధరించామని చెబుతూనే సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది. విలీనం వల్ల దక్కాల్సినవి దక్కకపోగా.. గతంలో సాధించుకున్నవి కూడా కోల్పోవాల్సి రావటంతో ఆర్టీసీ ఉద్యోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
ఫ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) కోసం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కోరుకుంటే.. నేడు ఓపీఎస్ అమలు కాక.. ఇటు సీపీఎస్ అమలు కాక.. కేవలం ప్రావిడెంట్ ఫండ్పై వచ్చే పెన్షన్ మాత్రమే గతయింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నపుడు ఆర్టీసీ కార్మికులంతా ఎంటీ డబ్ల్యూ యాక్టు పరిధిలోకి వచ్చేవారు. విలీనానంతరం ట్రాఫిక్, మెయింటినెన్స్ సిబ్బంది ఎంటీడబ్ల్యూ యాక్టు పరిధిలో వస్తారని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఎంటీడబ్ల్యూ యాక్టు పరిధిలో ఉన్న రాయితీలు, హక్కులన్నీ కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.
ఫ ప్రభుత్వంలో విలీనం పేరుతో ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)ని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈక్విటీ లేకపోవటం వల్ల కేవలం ఆర్టీసీ కార్మికులు మాత్రమే పీటీడీలో విలీనమయ్యారు. ఆర్టీసీగా అలానే ఉంది. పీటీడీ ఏర్పాటైనా ప్రభుత్వ సర్వీసు రూల్సు వర్తింపచేయటం లేదు. జనవరి 1, 2020 నుంచి ఆర్టీసీ ఉద్యోగులను పీటీడీలో విలీనం చేసినపుడు క్యాడర్ స్ర్టెంగ్త్కు సంబంధించి వివధ కేటగిరీల నార్మ్స్ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయించారు. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగుల కుదింపుతో పరిపాలనా వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారాయి. తరచుగా బస్సుల ఫెయిల్యూర్లకు ఆజ్యం పోసింది. పీటీడీ ఉద్యోగులకు సర్వీసు రూల్స్ బదులుగా ఏపీఎ్సఆర్టీసీ రిక్రూట్మెంట్ రెగ్యులేషనర్స్ కొనసాగించని కారణంగా తీవ్ర నష్టం జరుగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను పీటీడీలో విలీనం చేసిన తర్వాత వారికి ఉన్న రిక్రూట్మెంట్ రెగ్యులేషన్స్ స్థానంలో సర్వీసు రూల్స్ను ఉద్యోగ సంఘాలు, కింది స్థాయి అధికారులతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేశారు. దీంతో సంస్థలోని 95 శాతం మందికి న్యాయంగా రావాల్సిన పదోన్నతుల అవకాశాలను పోగొట్టుకున్నారు. పీటీడీ ఉద్యోగులు మాత్రం తాము విలీనమైనప్పటి నుంచి పదవీ విరమణ అయ్యే వరకు ఆర్టీసీ రిక్రూట్మెంట్ రెగ్యులేషన్స్ కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
ఫ విలీనానికి ముందు కార్మికులకు వైద్య సేవలు రిఫరల్ హాస్పిటల్స్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందేవారు. పీటీడీలో విలీనం పేరుతో ఈహెచ్ఎస్ ద్వారా అపరిమిత ప్రయోజన అవకాశాలు పోగా.. అసలు ఈహెచ్ఎస్ కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. విలీనమైన నాలుగేళ్లుగా సరెండర్ లీవు చెల్లింపులు జరగటం లేదు. ఆర్టీసీ సర్వీసు రెగ్యులేషన్-30 అనుసరించి పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణలో తీవ్ర అన్యాయం జరిగింది. ఆర్టీసీలో పనిచేస్తూ మెడికల్ అన్ఫిట్ కారణంగా రిటైన సిబ్బంది కుటుబసభ్యులకు కారుణ్య నియామకలు ఇవ్వటానికి 2015 సంవత్సరంలో ఇచ్చిన సర్క్యులర్ను అనుసరించి దరఖాస్తుచేసుకున్న వారిని అనర్హులుగా తిరస్కరిస్తూ ఇబ్బందులు పెట్టారు. వీలీనం పేరుతో గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ వంటి పెన్షన్, బీమా పథకాలను ఏకపక్షంగా రద్దు చేశారు. డబ్బులను ఒకేసారి కాకుండా దశలవారీగా చెల్లిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. విలీనం తర్వాత చనిపోయిన, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి సెటిల్మెంట్స్ ప్రభుత్వం దగ్గర వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి.
ఫ సంస్థలోని అత్యాధునిక బస్సులకు కావాల్సిన నాణ్యమైన మెటీరియల్స్, టూల్స్ అన్ని గ్యారేజీలకు పంపిణీ జరగటం లేదు. ఆర్టీసీ సిబ్బందికి గతంలో ప్రతి సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇచ్చేవారు. చెప్పులు, షూ అలవెన్సులు ఇచ్చేవారు. విలీనం తర్వాత ఇవన్నీ ఆగిపోయాయి.
ఫ విలీనానికి ముందు ఇచ్చిన సర్క్యులర్ నెంబర్ 1/2019 పక్కన పెట్టి.. జీఓ నెంబర్ 70,71లను తీసుకువచ్చి కిందిస్థాయిలో పనిష్మెంట్లు, సస్పెండ్లు వంటివి ఎక్కువుగా తీసుకురావటం జరిగింది. విలీనం తర్వాత ఆర్టీసీలో కొత్తబస్సులను తీసుకురాలేదు. గతంలో ప్రతి ఏడాది 500 నుంచి 1000 కొత్త బస్సులు కొనేవారు. ప్రస్తుతం ఒక్క కొత్త బస్సు కొన లేదు. బస్సులు లేకపోవటం వల్ల వందలాది రూట్లను రద్దు చేశారు. విలీనానికి ముందు ఉన్న బస్సుల సంఖ్యతో పోల్చుకుంటే ప్రస్తుతం పావు వంతు బస్సులు తగ్గిపోయాయి. కాలం తీరిన బస్సులు తిరుగుతున్నాయి. విలీనానికి ముందు ఆర్టీసీ ఉద్యోగులకు నాలుగు సంవత్సరాలకు పీఆర్సీ ఉండేది. విలీనం తర్వాత ఐదు సంవత్సరాలకు పీఆర్సీ ఉంటోంది. ఈ కారణంగా 2021 పీఆర్సీని కోల్పోవటం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది.