మరింత సేవ చేసే అవకాశం కల్పించండి
ABN , Publish Date - Apr 16 , 2024 | 01:01 AM
కృష్ణాజిల్లాను అభివృద్ధి చేయడానికి, ప్రజలకు మరింత సేవచేయడానికి అవకాశం కల్పించాలని టీడీపీ-జనసేన-బీజేపీ మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రజలను కోరారు.
ఎన్నికల ప్రచారంలో వల్లభనేని బాలశౌరి
పామర్రు, ఏప్రిల్ 15: కృష్ణాజిల్లాను అభివృద్ధి చేయడానికి, ప్రజలకు మరింత సేవచేయడానికి అవకాశం కల్పించాలని టీడీపీ-జనసేన-బీజేపీ మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రజలను కోరారు. మండల పరిధిలోని రాపర్ల, జమీదగ్గుమిల్లి, పోలవరం, ఉండ్రపూడి గ్రామాల్లో సోమవారం కూటమి పామర్రు నియోజకవర్గ ఎన్టీయే అభ్యర్థి వర్ల కుమార్రాజాతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ చేసిందని, ప్రకృతి సం పదను ఇష్టారాజ్యంగా దోచుకుంటూ, ప్రశ్నించేవారిపై దాడులు కేసులతో భయ భ్రాంతులు సృష్టించి అరాచకపాలన చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని ఆయన కోరారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఎమ్మె ల్యేగా తనను, ఎంపీగా బాలశౌరిని గెలిపించాలని వర్ల కుమార్రాజా కోరారు. రాపర్ల ఎంపీటీసీ సభ్యుడు కూనపరెడ్డి సుబ్బారావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.