Share News

దళిత ద్రోహి జగన్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:26 AM

ముఖ్యమంత్రి జగన్‌ దళిత ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పాము తన గుడ్లను తానే మింగినట్లు...

దళిత ద్రోహి జగన్‌

ఎస్సీల నెత్తిన సీఎం భస్మాసుర హస్తం: చంద్రబాబు

25 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లింపు

27 సంక్షేమ పథకాలు రద్దు

ఓట్లు వేసిన దళితులను ముంచేశాడు

దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు

అంబేడ్కర్‌ విదేశీ విద్యకు తన పేరా?

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దు చేస్తా

జరిగేది క్లాస్‌వార్‌ కాదు.. క్యాష్‌వార్‌

ఈ ఐదేళ్లలో పేదలు నిరుపేదలయ్యారు

వలంటీర్లూ.. జగన్‌ మాయలో పడొద్దు

కొల్లూరు, రేపల్లె ప్రజాగళంలో బాబు

ఐదేళ్లలో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. ఇక రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలని నిశ్చయానికి వచ్చారు. ఎప్పుడు మే 13 (పోలింగ్‌ రోజు) వస్తుందా.. నెత్తిన పెట్టుకున్న కుంపటిని ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.

పంటల బీమాను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్‌. ధాన్యం కొనకుండా, కనీసం సంచులు కూడా ఇవ్వకుండా రైతులను గాలికొదిలేశాడు. పంట నష్టపోతే కనీసం పరామర్శకైనా వచ్చాడా?

ఈ జగన్‌కు ఓటెందుకు వేయాలి? బాబాయిని చంపినందుకా? గొడ్డలి వేటేసినందుకా? అందుకే వైనాట్‌ పులివెందుల.. వైనాట్‌ కడప అన్నట్లుగా ప్రజలు ముందుకు రావాలి. - చంద్రబాబు

గుంటూరు/బాపట్ల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ దళిత ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పాము తన గుడ్లను తానే మింగినట్లు.. తన పిల్లలను తానే తిన్నట్లు తనకు ఓట్లు వేసిన దళితులను ముంచేశాడని ధ్వజమెత్తారు. మూడుముక్కలాటతో రాజధాని లేకుండాచేసి రాష్ట్రాన్ని తలలేని మొండెంలా మార్చాడని దుయ్యబట్టారు. శుక్రవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు, రేపల్లె నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. నా ఎస్సీలంటూ వారి నెత్తిన జగన్‌ భస్మాసుర హస్తం పెట్టాడని, ఆయన ప్రభుత్వంలో ఎక్కువ బలైపోయింది ఎస్సీలేనని చెప్పారు. ‘నా ఎస్సీలు అని రూ.25 వేల కోట్ల సబ్‌ ప్లాన్‌ లేకుండా చేశాడు. నిధులు దారిమళ్లించాడు. చీరాలలో కిరణ్‌ను కొట్టి చంపారు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడిని చేసి, కొట్టి చంపారు. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు. దళితులకు 27 సంక్షేమ పథకాలు ఇస్తే వాటిని రద్దు చేశాడు. ఇన్నోవా కార్లు ఇస్తే రద్దు చేశాడు. అంబేడ్కర్‌ పేరుతో విదేశీ విద్య కోసం మేం ఒక్కో విద్యార్థికి 15 లక్షలు ఇస్తే, దాని పేరు మార్చి అంబేద్కర్‌ను అవమానించాడు’ అని విమర్శించారు. అమరావతిని నాడు జగన్‌ మొదట ఆమోదించి, అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడాడని.. ఇప్పుడు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడని విరుచుకుపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్ష వేస్తారో ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

నీది పాయిజన్‌.. నాది విజన్‌

జగన్మోహన్‌రెడ్డీ.. నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావ్‌.. నేను అభివృద్ధి చేయడానికి వచ్చా. నీది పాయిజన్‌.. నాది విజన్‌. రాష్ట్రానికి ఆదర్శ డ్రైవర్‌గా ఉంటా! అభివృద్థి పథంలో ముందుకు నడిపిస్తా! పిల్లలే మన ఆస్తి.. వారి చదువుకు ఎంతైనా ఇస్తా. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తా! మీ పిల్లలకు విద్య కావాలా.. గంజాయి, డ్రగ్స్‌ కావాలా? మీరే తేల్చుకోండి! పింఛనుదారులకు ఏప్రిల్‌ నుంచి రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున పింఛను పెంచి ఇస్తా.

ఇప్పుడు జరుగుతోంది క్లాస్‌ వార్‌ కాదు.. క్యాష్‌ వార్‌. పేదల హక్కుల కోసం జరుగుతున్న యుద్ధమిది. ఈ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు. ఈ ఐదేళ్లలో ఏ ఒక్క పేదకూ న్యాయం జరగలేదు. బాగుపడిందల్లా ఐదుగురు వక్తులే. సీఎం జగన్మోహనరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. రాష్ట్రంలో సంపదంతా వీరి దగ్గరే ఉంది. ప్రజా వేదికను కూల్చడంతో జగన్‌ విధ్వంసం మొదలుపెట్టాడు. పట్టిసీమను కూడా వాడుకోకుండా చేశాడు. 72 శాతం పూర్తయిన పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు.

భూమాఫియా కావాలా?

మీ ఆస్తులకు రక్షణ కావాలా.. వైసీపీ భూ మాఫియా కావాలా? నడుములు విరిగే దారుణమైన రోడ్లు కావాలా.. రహదారి భద్రత కావాలా? గుంతల్లో మట్టి వేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట. నమ్ముతారా? ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు తెచ్చి ఆస్తులన్నీ తన పేరుతో పెట్టుకుంటాడట! 10ఏ, అడంగల్‌ ఏవీ ఉండవట! ఆస్తి పేరు మారితే 90 రోజుల్లో అభ్యంతరం తెలుపకపోతే ఆస్తి వారిదికాకుండా పోతుందట! ఇలా ప్రజలందరి ఆస్తి జగన్‌ భూ మాఫియా కాజేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తా, ప్రజల ఆస్తికి రక్షణ కల్పిస్తా. పోలీసుల సంక్షేమ బాధ్యత నేనే తీసుకుంటా.

పిల్లలకు బంగారు భవిష్యత్‌..

వీర వనితలు, జనసైనికుల ఉత్సాహం చూస్తుంటే విజయం లాంఛనమే. మెజారిటీ లెక్కలే తేలాల్సి ఉంది. నా వయసు 73 ఏళ్లయినా ఆలోచనలన్నీ నవ యువకులవే. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో పెను మార్పులు జరగనున్నాయి. అందుకు అనుగుణంగా విజన్‌ రూపొందించే బాధ్యత తీసుకుని పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందేలా చూస్తా. మూడు పార్టీలు కలిసింది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే. రాష్ట్రంలో 160 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు ఎన్డీయేకే రావాలి. అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ గౌడ్‌ అనే బాలుడిని దారుణంగా హత్య చేస్తే నేరుగా వారింటికి వెళ్లి పరామర్శించని సిగ్గులేని వ్యక్తి ఈ సీఎం.

సామాజిక న్యాయమెక్కడ..?

చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పడంలో, నాలుక మడతేయడంలో జగన్‌ దిట్ట. సామాజిక న్యాయానికి పాతరేసి నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతున్నాడు. బీసీలకు 30 పథకాలు రద్దు చేశాడు. కాపులకు పది వేల కోట్లు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు. ముస్లింలకు రంజాన్‌ తోఫా, దుల్హన్‌ మౌజంలకు గౌరవ వేతనం ఇలా అన్నిటినీ పడకేయించాడు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక బీసీల కోసం ఏటా రూ.30,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఆదరణ పథకానికి రూ.5,000 కోట్లు కేటాయిస్తాం. టీడీపీ బీసీల పార్టీ. వారే వెన్నెముక.

వలంటీర్ల భవిష్యత్‌తో చెలగాటం...

వలంటీర్లంతా రాజీనామాలు చేసి వైసీపీకి పనిచేస్తే మళ్లీ వచ్చాక నియమిస్తానంటూ వారి భవిష్యత్‌తో జగన్‌ చెలగాటమాడుతున్నాడు. వారెవరూ రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. జీతం పెంచే బాధ్యత తీసుకోవడంతో పాటు స్కిల్‌లో శిక్షణ ఇచ్చి ఆదాయం పెంచుతాను. వైసీపీ ఉచ్చులో పడొద్దు. రోడ్డుమీద గ్రావెల్‌ కూడా దొంగిలించే వారిపై బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోలీసాఫీసర్‌ టి.కృష్ణప్రసాద్‌ను పోటీకి దించా. నేను సంస్కారం, చదువు ఉన్న వాళ్లను ప్రోత్సహిస్తే.. జేబులు కొట్టేవాళ్లను, భూకబ్జాలు చేసే వాళ్లను ప్రోత్సహించడం జగన్‌ నైజం.

Updated Date - Apr 13 , 2024 | 05:27 AM