Share News

Chandrababu: వెయ్యిమంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదిలించలేరు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 09:46 AM

రాజధాని అంటే నాలుగు బిల్డింగులని ఈ మూర్ఖులు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అవైతే ఎప్పుడో కట్టేశానని.. అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు కట్టానని గుర్తుచేశారు. కానీ వాటితో రాజధాని కాదన్నారు. ‘రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం. గర్వంగా చెప్పుకొనే ప్రజల ఆస్తి.

Chandrababu: వెయ్యిమంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదిలించలేరు..

జూన్‌ 4న జగనాసుర వధ..

అమరావతి వేడుక: చంద్రబాబు

రాజధాని అంటే 4 బిల్డింగులని

ఈ మూర్ఖులు అనుకుంటున్నారు

అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు ఎప్పుడో కట్టా

కానీ రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం

గర్వంగా చెప్పుకొనే ప్రజల ఆస్తి

నాలెడ్జ్‌ హబ్‌గా మార్చాలని కోరుకున్నా

తిక్కలోడు వచ్చి నాశనం చేశాడు

వాతలు పెడితే మూడు ముక్కల ఊసెత్తడు

రాజధాని మహిళల పోరాటం అద్వితీయం

వారి వల్లే అమరావతి గెలిచింది.. నిలిచింది

కేంద్రంలో మోదీ, ఇక్కడ పవన్‌ మనకు తోడు

సీఎం కాగానే ప్రజావేదిక పునర్నిర్మిస్తా

జగన్‌ మొద్దబ్బాయి.. సీఎంగా పనికిరాడు

వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీరకాయే

అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ

వలంటీర్లు రాజీనామా చేస్తే భవిష్యత్‌ ఉండదు

ప్రజాగళంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ

గుంటూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని అంటే నాలుగు బిల్డింగులని ఈ మూర్ఖులు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విరుచుకుపడ్డారు. అవైతే ఎప్పుడో కట్టేశానని.. అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు కట్టానని గుర్తుచేశారు. కానీ వాటితో రాజధాని కాదన్నారు. ‘రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం. గర్వంగా చెప్పుకొనే ప్రజల ఆస్తి. హైదరాబాద్‌కు దీటుగా, దేశంలో నంబర్‌ వన్‌గా, ప్రపంచంలోని గొప్పనగరాల్లో ఒకటిగా నిర్మించాలనుకున్నా. విట్‌, అమృత, ఎస్‌ఆర్‌ఎం వంటి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను అమరావతికి తెచ్చా. నాలెడ్జ్‌ హబ్‌గా మార్చాలని కోరుకున్నా. తిక్కలోడు వచ్చాడు. నాశనం చేశాడు’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. సిగ్గుంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాగళంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో ఆయన భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు విడుదల చేసే రోజే అమరావతే రాజధాని అని మీరంతా వేడుక జరుపుకొనే రోజని, ఆ రోజున జగనాసుర వధ.. అమరావతి రక్షణ రెండూ జరుగుతాయని చెప్పారు. ‘ఇది తాడికొండ కాదు.. ఇది అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఈరోజు వచ్చింది రాజధాని అమరావతికి. రాష్ట్రం నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నా.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా.. ఎవ్వరూ అమరావతిని ఒక వెంట్రుకవాసి కూడా కదిలించలేరు!’ అని తేల్చిచెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చిన 29 వేల మంది రైతులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. ‘ఒకనాటి శాతవాహనుల రాజధాని, దేవతల రాజధాని అమరావతి. దేశంలోని అన్ని దేవాలయాలు, నదులు, మసీదులు, చర్చిల నుంచి పవిత్రమైన మట్టి, పుణ్యజలం తెచ్చి అమరావతిని పునీతం చేశా. అందువల్ల ఇలాంటి జగన్‌లు వంద మంది కాదు.. వెయ్యి మంది వచ్చినా అమరావతిని ఒక్క ఇంచ్‌ కూడా కదలించలేరు. దాని ముహూర్తబలం.. స్థానబలం అలాంటిది’ అని స్పష్టం చేశారు. తాను రాజధానిపై 2019లో చేసిన హెచ్చరికలను ప్రజలకు గుర్తుచేశారు. ‘తిక్కలోడికి ఓటేయొద్దని చెప్పా. ముద్దులు పెట్టాడు. బుగ్గలు తాకాడు. మీరంతా ఐసైపోయి అవకాశం ఇచ్చేశారు. ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందో తెలిసిందా’ అని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే..

రాజధానిపై తిక్కలోడి మూడు ముక్కలాట! మూడు రాజధానులు చేసేశానంటూ తమాషాలు చేస్తున్నాడు. వాతలు పెడితే అలా మాట్లాడడం మానేస్తాడు

పోలీసులూ.. ఇకనైనా మారండి. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ప్రభుత్వముంటే వారికి ఉద్యోగాలు వస్తాయా? – చంద్రబాబు

రాజధాని మహిళలకు అభినందనలు..

అమరావతి నిర్మాణానికి నాకిచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వృధా చేయకుండా రాజధాని పనులు చేపట్టాను. రాయి రాయి పేర్చుకుంటూ నిర్మించాను. దానిని జగన్‌ ధ్వంసం చేశాడు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రత్యేకించి అమరావతి మహిళల పోరాటం అమోఘం.. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 3 వేల కేసులు.. అడుగడుగునా అవమానాలు, పోలీసుల హింస, స్టేషన్లో, జైల్లో పెట్టి వేధింపులు. ఎన్ని చేసినా పోరాటం ఆపకుండా న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేపడితే దారి మధ్యలో భోజనం చేయడానికి లేకుండా దుర్మార్గుడు జగన్‌ వేధించాడు. అయినా సరే రోడ్డు మీదే తిని పోరాటం కొనసాగించిన మహిళలు, రైతుల పోరాటం మరువలేనిది. మీ పోరాటంతోనే అమరావతి గెలిచింది. నిలిచింది. అయితే రాజధాని విధ్వంసం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వానికి రావలసిన 4–5 లక్షల కోట్ల ఆదాయం నష్టం జరిగింది. కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవాడైతే 10 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేస్తాడా? మళ్లీ నేను రాగానే దాని నిర్మాణం జరుగుతుంది.

సీఎంగా విఫలం..

జగన్‌ మొద్దబ్బాయి. ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడు. సీఎంగా ఏమాత్రం పనికిరాడు. 99 శాతం హామీలు అమలు చేశానంటున్నాడు. ప్రజలు మాత్రం ఆయన ఐదేళ్ల పాలనకు ఇచ్చే మార్కులు సున్నా. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. అదే ఈ రాష్ట్రానికి సంజీవని అని కూడా చెప్పాడు. ఆయన మాటలు నమ్మి ప్రజలు అధికారం ఇచ్చినందుకు సర్వనాశనం చేశాడు. ఇసుక మాఫియాకు డాన్‌ జగన్‌. అధికారంలోకి వస్తూనే ఉచిత ఇసుకను రద్దు చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టాడు. ఈ రోజుకూ వాళ్లు తేరుకోలేదు. పొత్తులతో ప్రజల ముందుకు వచ్చాం. మా మూడు పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ వచ్చి సంఘీభావం తెలిపారు. అవసరమైతే త్యాగాలు చేద్దాం తప్ప ఓటు చీలకూడదన్నారు. ఇందుకోసం అందరం కొంత తగ్గాం. మాతో ఎంఆర్‌పీఎస్‌ కూడా జత కట్టింది. ఆనాడు నేనే ఎస్సీల వర్గీకరణ చేశాను. ప్రధాని మోదీ కూడా అంగీకరించారు. అధికారంలోకి రాగానే జిల్లాల వారీగా వర్గీకరణ చేసి అందరికీ సమన్యాయం చేస్తా.

సూపర్‌ సిక్స్‌తో జగన్‌ గుండె ఆగింది..: చంద్రబాబు..

నేను సూపర్‌ 6 ప్రకటించగానే జగన్‌ గుండె ఆగినంత పనైంది. నా మొదటి ప్రాధాన్యం ఆడబిడ్డలకే. అందుకే సూపర్‌ సిక్స్‌లో మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ప్రకటించాం. నేను సురక్షితమైన డ్రైవర్‌ను. రాష్ట్రాన్ని భద్రతగా ముందుకు నడిపిస్తా. ఆంక్షలు లేకుండా ఇంటివద్దనే రూ.4 వేల పింఛను ఇప్పిస్తాను. ‘నేను అసెంబ్లీకి రాను. అది కౌరవసభ. నేను గెలిచి దాన్ని గౌరవ సభగా మార్చి జూన్‌ 4వ తేదీన గౌరవ సభలో అడుగుపెడతానని చెప్పా. ఆ మాట ప్రకారం సగౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతా.

గుంతలు పడిన రోడ్లలో మట్టి వేయలేని వాడు.. మూడు రాజధానులు కడతాడా? సీపీఎస్‌ను వారంలో రద్దు చేస్తానని అధికారంలోకి వచ్చి ఎన్ని వారాలైనా ఎదురు చూడాల్సిందేనా? ఇదీ ఆయన విశ్వసనీయత. చేసేవన్నీ తప్పుడు పనులు.. చెప్పేవన్నీ అబద్ధాలు.

వలంటీర్లూ.. బెదిరిస్తే భయపడొద్దు

వలంటీర్లు కూడా మనుషులే. మీ జీతాలు కూడా పెంచుతా. రూ.5 వేలను రూ.10 వేలు చేస్తానని ప్రకటించా. ఈ దెబ్బకు వైసీపీ పెద్దలు గిజగిజలాడుతున్నారు. వారితో రాజీనామా చేయిస్తున్నారు. చేయనంటే బెదిరిస్తున్నారు. వచ్చేది మేమే. రాజీనామా చేస్తే ఉద్యోగం గోవిందా! మళ్లీ ఉద్యోగాలు రావు. మిమ్మల్ని బెదిరిస్తే నా పేరు చెప్పండి. చంద్రన్న చెప్పాడు. మీ బెదిరింపులకు భయపడం.. మా జీవితాలు బాగుపడతాయి.. రూ.10 వేలు వస్తుంది. అంతేకాదు రూ.లక్షలు సంపాదించే మార్గం చూపిస్తా. నిన్న తిక్కల మంత్రి అధర్మాన మాట్లాడుతున్నాడు. వలంటీర్లకు నెత్తిన కిరీటం పెడితే ఇప్పుడు మాకే మోసం చేస్తారా? మీ భరతం పడతానన్నాడు. నేను చెబుతున్నా. ధర్మానా.. నువ్వు ఉండబోయేది ఎక్కడో గుర్తుపెట్టుకో. ఎన్నికల ముందే నీ భరతం వాళ్లు పడతారు. వలంటీర్లు తప్పులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు. నేను అండగా ఉంటా.

అమర్‌నాథ్‌ సోదరి హేమశ్రీకి అండగా ఉంటాం: చంద్రబాబు

రేపల్లె, ఏప్రిల్‌ 13: ప్రజాగళం పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును అమర్‌నాథ్‌ గౌడ్‌ కుటుంబసభ్యులు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిశారు. వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతేడాది తన అక్కను వేధించిన వైసీపీ సానుభూతిపరుడు వెంకటేశ్వర్లురెడ్డిని ప్రశ్నించినందుకు పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్‌గౌడ్‌పై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి హత్య చేసిన సంగతి తెలిసిందే. అమర్‌నాథ్‌ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచి పోరాడింది. పార్టీ తరఫున చంద్రబాబు ఆ సమయంలో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. అమర్‌నాథ్‌గౌడ్‌ సోదరి హేమశ్రీ ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారు. హేమశ్రీని ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను పోలీస్‌ అవ్వాలనుకుంటున్నానని హేమశ్రీ చెప్పగా, ‘నువ్వు కష్టపడి చదువు.. అన్ని విధాలా నేను అండగా ఉంటానని బాబు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

కుప్పం, ఏప్రిల్‌ 13: టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు... ‘ఈనెల 18న భువనేశ్వరి కుప్పం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త చంద్రబాబు తరఫున 19వ తేదీ మధ్యాహ్నం 12.33 గంటలకు నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఊరేగింపు నిర్వహించాలని నియోజకవర్గ పార్టీ సంకల్పించింది. నామినేషన్‌ దాఖలుకు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభంజనంలా తరలి రావాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆమేరకు పార్టీ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ వర్గాలు శనివారం నుంచే విస్తృత ప్రచారం చేస్తున్నాయి.

Updated Date - Apr 14 , 2024 | 09:49 AM