Share News

ముప్పని తెలిసీ ’ముంచేశారు’

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:57 AM

ఇళ్లస్థలాల పేరుతో కాకినాడ సిటీ నియోజకవర్గ పేదలను జగన్‌ ప్రభుత్వం నిలువునా వంచించిన తీరు బట్టబయలవుతోంది. స్థలాల కొరత సాకుతో 13,500మందికి ఎక్కడో దూరంగా ఉన్న యు.కొత్త పల్లి మండలం కొమరగిరిలో పట్టాలు ఇచ్చేసి చేతులు దులిపేసు కోవడం ఎంత తప్పిదమో బయటపడుతోంది. ఇక్కడ పట్టాలిచ్చి పే దలకు చేసిన మేలు కంటే కీడే ఎక్కువనే నిజాలు నిలకడపై తేలు తున్నాయి.

ముప్పని తెలిసీ ’ముంచేశారు’
కొమరగిరిలో ఇళ్లకు అతి సమీపంగా వచ్చేసిన సముద్రం నీరు

  • -ఇళ్ల స్థలాల పేరుతో కాకినాడసిటీలో పేదలను నిలువునా ముంచేసిన జగన్‌ ప్రభుత్వం

  • -13,500 మంది లబ్దిదారులకు కాకినాడ కాదని యు.కొత్తపల్లి కొమరగిరిలో స్థలాలు

  • -ఇప్పుడా లేఅవుట్‌కు తరచూ సముద్ర జలాల పోటు ముప్పు

  • -ఇటీవల సముద్రం పోటుకు లేఅవుట్‌లో ఇళ్లకు సమీపంగా వచ్చేసిన సముద్రం

  • -బెంబేలెతిపోతున్న లబ్దిదారులు: ఏక్షణాణ ఏమవుతుందోనని బిక్కుబిక్కు

  • -మున్ముందు స్థలాలు, ఇళ్లు ఉప్పు నీటిలో మునిగిపోతాయని కలవరం

  • -పైగా తీరానికి ఆనుకుని ఉండడంతో భారీగాలుల భయంతో ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పేదల అనాసక్తి

  • -మొత్తం 13,500 ఇళ్లకు ఇప్పటివరకు పూర్తయినవి 180

  • -సీఎం జగన్‌ రాష్ట్రంలో తొలిసారి ప్రారంభించిన లేఅవుట్‌ నవ్వులపాలు

  • -కాగా పేదల ఇళ్లస్థలాల కొనుగోలు, చదును పేరుతో రూ.60కోట్లకుపైగా మెక్కేసిన నేతలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)/కొత్తపల్లి

ఇళ్లస్థలాల పేరుతో కాకినాడ సిటీ నియోజకవర్గ పేదలను జగన్‌ ప్రభుత్వం నిలువునా వంచించిన తీరు బట్టబయలవుతోంది. స్థలాల కొరత సాకుతో 13,500మందికి ఎక్కడో దూరంగా ఉన్న యు.కొత్త పల్లి మండలం కొమరగిరిలో పట్టాలు ఇచ్చేసి చేతులు దులిపేసు కోవడం ఎంత తప్పిదమో బయటపడుతోంది. ఇక్కడ పట్టాలిచ్చి పే దలకు చేసిన మేలు కంటే కీడే ఎక్కువనే నిజాలు నిలకడపై తేలు తున్నాయి. పేదల ఇళ్లస్థలాల ముసుగులో కాకినాడ వైసీపీ కీలక నేత నొక్కేసిన కోట్ల భాగోతం సముద్రం సాక్షిగా ఇప్పుడు వెలుగులో కి వస్తోంది. ఏకంగా ఇక్కడ లేఅవుట్‌కు సముద్రంపోటు ముప్పు పె రగడంతో లబ్ధిదారులు వణికిపోతున్నారు. కట్టిన ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటున్నారు. ఇంకా కట్టనివాళ్లు లేఅవుట్‌ ఊసెత్తితేనే ఉలిక్కిపడు తున్నారు. తాజాగా సముద్రం పోటుకు నీళ్లు ఏకంగా ఈలేఅవుట్‌ స్థలాలు, ఇళ్లకు సమీపంగా రావడంతో బెంబేలెత్తిపోతు న్నారు. ము న్ముందు సముద్ర జలాల్లో లేఅవుట్‌ ఎక్కడ మునిగి పోతుందోనని తల్చుకుని వణికిపోతున్నారు. ఉప్పు నీటిలో స్థలాలు, ఇళ్లు నానితే ఎందుకూ పనికిరావని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రాష్ట్రం లోనే తొలిసారిగా పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌ను సీఎం జగన్‌ ఇక్కడినుంచే ప్రారంభించించగా ఇప్పుడు దీనికి సముద్రం పోటు ముప్పు పెరగడం ప్రభుత్వాన్ని నవ్వులపాలయ్యేలా చేస్తోంది.

వైసీపీ కీలక నేత స్కెచ్‌

పేదలందరికీ ఇళ్లపథకంలో భాగంగా జగన్‌ ప్రభుత్వం 2020లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో లబ్ధిదారుల ను గుర్తించింది. దాదాపు 25 వార్డుల్లో 16వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అవసర మని తేల్చింది. వీరికి పట్టాల పంపిణీకి వం దల ఎకరాలు అవసరం కాగా, ప్రభుత్వ భూ మి లేకపోవడంతో ప్రైవేటు భూములు కొనా ల్సి వచ్చింది. ఇందుకు కోట్లలో ఖర్చవుతుందని ప్రభుత్వం గుడ్లు తేలేసింది. దీంతో సదరు కాకినాడ వైసీపీ కీలక నేత స్కెచ్‌లో భాగంగా అధికారులు ఎక్కడో దూరంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని యు.కొత్తపల్లి మం డలం కొమరగిరిలో భూములు సేకరించాలని ప్రతిపాదించారు. ఇవి సముద్ర తీరానికి అతి సమీపంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించు కోలేదు.భవిష్యత్తులో సముద్రం పోటు ముప్పు, తుఫాన్ల సమయంలో పెనుగాలులు వీస్తా యని తెలిసినా ఈ భూము లను సేకరించారు.

పేదల కంటే పెద్దలకే లబ్ధి..

పేదల ఇళ్లస్థలాల ముసుగులో ఇక్కడ 365ఎకరాలు ప్రైవేటు భూములు గుర్తించారు. ఎకరం రూ.25లక్షల వరకు ఉండగా, సదరు కీలక నేత ముందుగానే తక్కువ ధరకు బినామీలతో భూములు కొనిపించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఎకరాకు రూ.41లక్షల చొప్పున అంటగట్టా రు. రూ.145కోట్లకుపైగా అయిన భూసేకరణ ఖర్చులో కోట్లలో కొట్టేశారు. 2020, డిసెంబర్‌ 25న సీఎం జగన్‌ ఈ 365 ఎకరాల కొమరగిరి లేఅవుట్‌ను ప్రారంభించారు. 13,500మందికిపైగా కాకినాడ సిటీ నియోజకవర్గ లబ్ధిదా రులకు పట్టాలు పంచారు. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు ఇక్కడ పూర్తయిన ఇళ్లు కేవలం 180 మాత్ర మే. దీన్నిబట్టి ఇక్కడ లేఅవుట్‌లో పేదలు ఇళ్లు కట్టుకోవ డానికి ఎంత అనాసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇళ్లు నిర్మించుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని అనేక సార్లు అధికారులు బెదిరించినా లబ్ధిదారులు ఇళ్లు కట్టడా నికి ముందుకు రాలేదు. దీంతో సీఎం జగన్‌ స్వయంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించిన పేదల ఇళ్లస్థలాల లేఅవుట్‌ నవ్వుల పాలైంది. ప్రస్తుతం ఇక్కడ 5వేల ఇళ్లు పునాదుల స్థాయిలో ఆగిపోయాయి. 800శ్లాబ్‌దశలో నిలి చిపోయాయి. 150ఇళ్లు లింటల్‌, 4వేల ఇళ్లు ప్లింత్‌ దశలో కొన్నేళ్లుగా పడకేశాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈలేవుట్‌ లో ఇళ్లనిర్మాణానికి కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధి లోని పేదలు అసలే మాత్రం ఆసక్తి చూపడం లేదు. కా నీ ఇళ్ల నిర్మాణం పూర్తయిపోతుందనే గుడ్డి నమ్మకంతో జగన్‌ సర్కారు రూ.35కోట్లు వెచ్చించి రహదారులు, వి ద్యుత్‌ వసతి తదితర సౌకర్యాలు కల్పించింది. కానీ లబ్ధి దారులు మాత్రం ఇళ్ల నిర్మాణానికి భయపడిపోతున్నారు.

సముద్రం ముంచేస్తోంది

ఒకపక్క సముద్రం.. చెంత నే ఇళ్లస్థలాలు.. ఇంత ఖరీదైన భూములు తమ ప్రభుత్వం కాబట్టే పేదలకుఇచ్చిందంటూ సీఎం జగన్‌ నుంచి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి వరకు అదేపనిగా ఊద రగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడ లేఅవుట్‌ నిర్మించి పేద లకు స్థలాలు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. పేరుకు పక్కనే బీచ్‌ ఉన్నా తరచూ సముద్రం పోటు ప్రభావంతో లేఅవుట్‌ స్థలాల వర కు నీరు వచ్చేస్తోంది. ఈదురుగాలులు, అలల తీవ్రతకు సముద్రం ఉప్పాడ బీచ్‌రోడ్డును దాటేసి లేఅవుట్‌ ఇళ్ల వరకు ఉప్పు నీళ్లు ముంచేస్తున్నాయి. తాజాగా సముద్రం పోటు ప్రభావంతో భారీగా సముద్రజలాలు ఇళ్ల స్థలాలను తాకాయి. కొన్ని ఇళ్లకు అతి సమీ పంగా ఈ నీళ్లు వచ్చేశాయి. దీంతో ఇప్పుడక్కడ చూస్తే పోటుతో వచ్చిన సముద్రం నీరుతో ఇళ్లస్థలాలు ఎప్పుడు ముగినిపోతాయో అన్నట్లు ఉంది. వాస్తవానికి లేఅవుట్‌ వెళ్లేందుకు ఎత్తుగా నిర్మించిన రహదారి అడ్డుగా ఉండడంతో కొంత ప్రాంతం సముద్రం నీరుకు దూరంగా ఉంది. లేకపోతే మరిన్ని ఇళ్లస్థలాలు ఉప్పునీటిలో ముని గిపోయి ఉండేవి. ఇదే కాదు.. తరచూ సముద్రం పోటు ప్రభా వంతో స్థలాల్లోకి నీళ్లు వచ్చేస్తుండడంతో పేదలు భయపడుతు న్నారు. ఏక్షణం సముద్రం పోటుతో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రివేళల్లో అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అసలే ఉప్పు నీరు కావడంతో గోడలు, ఇళ్లు ఎందుకు పనికి రావని ఆందోళన చెందుతున్నారు. అటు ఖాళీగా ఉన్న పునాదుల్లోకి ఉప్పు నీరు వస్తుండడంతో అవెందుకూ పనికిరావేమోనని పేదలు లేఅవుట్‌వైపు కూడా చూడడం లేదు. తుఫాన్ల సమ యంలో తీరం వెంబడి బలమైన ఈదు రుగాలుల శబ్ధంతో ఇక్కడ నివాసం ఉంటున్న వారు బెంబేలెత్తుతున్నారు. కొందరైతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లి పోయారు. ఇలా ఎప్పటికప్పుడు సముద్రం ముప్పు పెరుగుతుండడంతో సీఎం జగన్‌ ప్రారంభించిన లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు రావడం లేదు. కష్టమైనా కాకినాడలోనే అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. కానీ వీరికి స్థలాలు ఇచ్చే పేరుతో సదరు కాకినాడ సిటీ వైసీపీ కీలక నేత మాత్రం స్థలాల కొనుగోలు, లేఅవుట్‌ చదును పేరుతో ఎన్ని కోట్లు తిన్నారో లెక్కలేదు.

Updated Date - Apr 16 , 2024 | 12:57 AM