ఇద్దరిని మింగేసిన అతివేగం
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:57 PM
కొవ్వూరు మండలం కాపవరం హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు కొవ్వూరు రూరల్ ఎస్ఐ కె.సుధాకర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇరువురి మృతి
ఆరుగురికి స్వల్పగాయాలు
ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొనడంతో ఘటన
కొవ్వూరు, ఏప్రిల్ 28: కొవ్వూరు మండలం కాపవరం హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు కొవ్వూరు రూరల్ ఎస్ఐ కె.సుధాకర్ తెలిపారు. ఏలూరు శనివారపుపేటకు చెందిన తారా డేవిడ్ మరో ఏడుగురు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ శనివారం రాత్రి ఏలూరు నుంచి గుంటూరు వెళ్లి సౌండ్ సిస్టమ్స్ లోడ్ చేసుకుని విశాఖపట్నం పరిధిలోని చోడవరం ఐషర్ వ్యాన్పై బయలుదేరారు. మార్గ మధ్యలో కాపవరం హైవేపై గోవర్దనగిరిమెట్ట ఫ్లైఓవర్ సమీపానికి చేరుకునే సరికి జగ్గయ్యపేట నుంచి సిమ్మెంటు లోడ్తో ఒరిస్సా వెళ్తున్న లారీ రోడ్డు మార్జిన్ల్లో ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా నిలుపుదల చేశాడు. డ్రైవర్ వ్యాన్ను కంట్రోల్ చేయలేక ఆగివున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏలూ రుకు చెందిన మేడం వినోద్కుమార్(32), దారబోయిన ప్రభాకర్(21)లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు, రాత్రి గస్తీ నిర్వహిస్తున్న దిశ డీఎస్పీ, రోడ్డు భద్రతా మొబైల్ సిబ్బంది, ఎన్హెచ్ 16 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలను ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తారా డేవిడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.