16,547మందికి పోస్టల్ బ్యాలెట్
ABN , Publish Date - Apr 30 , 2024 | 02:04 AM
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 16,547 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
ఫ ఇందులో 4,633 మంది జిల్లాయేతర సిబ్బంది
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 29: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 16,547 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ పొందనున్న వారిలో జిల్లా ఉద్యోగులు 11,914 మంది, జిల్లాయేతరులు 4,633 మంది ఉన్నారన్నారు. ఇతర జిల్లాల ఉద్యోగులు 12డి ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారు కోరిన నియోజకవర్గాల్లో మే 5వ తేదీన ఓటు వేసుకోవచ్చని తెలిపారు. దివ్యాంగులు, 85 సంవత్సరాలు మించిన 596 మంది మే 6, 7 తేదీలలో బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు హక్కును వారి ఇళ్ల వద్దనే వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. మే ఒకటి నుంచి ఇళ్ల వద్దే పింఛను పంపిణీ గురించి వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో పుల్లయ్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు.