Share News

చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:56 AM

ఎర్రచందనం స్మగ్లర్‌, మద్యం అక్రమ రవాణా, ఇసుక మాఫియా, భూకబ్జా చేసేవాడికి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిందని, అతనిపై అనేక పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయని విజయానందరెడ్డిని ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్‌
చిత్తూరులో ర్యాలీగా వస్తున్న బాలకృష్ణ

ఫ అనేక పోలీస్‌స్టేషన్లలో అతనిపై కేసులున్నాయి

ఫ జిల్లాలో విచ్చలవిడిగా డ్రగ్స్‌, గంజాయి లభ్యం

ఫ అభివృద్ధి పథంలో నడిపించేది టీడీపీయే

ఫ వైసీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితం

చిత్తూరు సిటీ, బంగారుపాళ్యం, ఏప్రిల్‌ 29: ఎర్రచందనం స్మగ్లర్‌, మద్యం అక్రమ రవాణా, ఇసుక మాఫియా, భూకబ్జా చేసేవాడికి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిందని, అతనిపై అనేక పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయని విజయానందరెడ్డిని ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా సోమవారం బంగారుపాళ్యం, చిత్తూరులో బాలకృష్ణ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘టీడీపీ హయాంలో జిల్లాకు పెద్దయెత్తున పరిశ్రమల్ని తెచ్చి యువతకు ఉపాధి కల్పించాం. విజయా డెయిరీని పునరుద్ధరిస్తామని అమూల్‌కు కట్టబెట్టేసి కమీషన్లు తీసుకుంటున్నారు. చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. వైసీపీ వచ్చినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి విచ్చలవిడిగా లభిస్తున్నాయి. యువత భవిష్యత్తును వైసీపీ నాశనం చేస్తోంది. జిల్లాలో టీడీపీ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైసీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితమైంది.’ అన్నారు.

ఫ తమ్ముడు గురజాలను, అనుభవజ్ఞుడు ప్రసాద్‌రావును గెలిపించండి

‘చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్‌ యువకుడు, ఉత్సాహవంతుడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. తమ్ముడు గురజాలను కచ్చితంగా గెలిపించండి. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన దగ్గుమళ్ల ప్రసాద్‌రావుకు అన్ని రంగాల మీద అపార అనుభవం, పట్టు ఉంది. కేంద్రంతో సఖ్యతతో ఉండి అభివృద్ధి చేయగలరు. అనుభవజ్ఞుడ్ని గెలిపించి పార్లమెంటుకు పంపించండి’ అని చిత్తూరులో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ కోరారు.

ఫ మురళీమోహన్‌ను అసెంబ్లీకి పంపండి

‘పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ను కచ్చితంగా గెలిపించి అసెంబ్లీకి పంపించండి’ అంటూ బంగారుపాళ్యంలో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ కోరారు. బంగారుపాళ్యంలో జరిగిన సభను చూసేందుకు పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల మండలాల నుంచి పెద్దయెత్తున ప్రజలు తరలివచ్చారు. బంగారుపాళ్యం నాలుగు రోడ్ల కూడలిలో ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ గజమాలతో స్వాగతం పలికారు.

ఫ ఆకట్టుకున్న ప్రసంగం.. ఎగబడిన జనం..

చిత్తూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో సుమారు 45 నిమిషాల పాటు సాగిన బాలయ్య ప్రసంగం ఆకట్టుకుంది. టీడీపీకి బలం కార్యకర్తలేనంటూ, మీ అభిమానాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోందని వారిని ఉత్సాహపరిచారు. ముస్లింలు అధిక సంఖ్యలో కనిపించేసరికి చిత్తూరులో ఉర్దూ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. రెండు చోట్లా ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్‌ గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ చేసిన సంస్కరణల గురించి, చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అరాచకాల గురించి బాలయ్య ప్రసంగిస్తుండగా శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా డైలాగులతో మరింత ఆకట్టుకున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 01:56 AM