గంగజాతర తేదీల మార్పు
ABN , Publish Date - Apr 30 , 2024 | 02:06 AM
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా చిత్తూరు నగరంలో గంగజాతర మే 13, 14 తేదీల బదులు 21, 22 తేదీల్లో జరుగుతుందని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
- 21, 22 తేదీల్లో..
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 29: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా చిత్తూరు నగరంలో గంగజాతర మే 13, 14 తేదీల బదులు 21, 22 తేదీల్లో జరుగుతుందని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు, పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా జాతర నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తేదీల మార్పునకు వంశపారంపర్య ధర్మకర్తలు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. చాటింపు మే 14న ఉంటుందని వెల్లడించారు.
పలమనేరులో 20, 21, 22 తేదీల్లో..
పలమనేరు : పలమనేరు గ్రామదేవత తిరుపతి గంగమ్మ జాతరను మే 20, 21, 22 తేదీల్లో నిర్వహించడానికి గ్రామపెద్దలు తీర్మానించారు. ఇక్కడ ఏటా మే 14, 15, 16 తేదీల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ 30న చాటింపు వేయడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మే 13న ఎన్నికల దృష్ట్యా పట్టణ పెద్దలు సోమవారం సమావేశమై 20, 21, 22తేదీల్లో నిర్వహించాలని తీర్మానించారు. మే 6వ తేదీ సోమవారం రాత్రి చాటింపు వేస్తారు.