మాయ మాటలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్
ABN , Publish Date - May 04 , 2024 | 11:33 PM
మోసపూరిత మాటలతో కాంగ్రెస్ మభ్యపెడుతోందని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్
చౌటుప్పల్ టౌన్, మే 4: మోసపూరిత మాటలతో కాంగ్రెస్ మభ్యపెడుతోందని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణకు కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మొదటగా కాంగ్రెస్ నాయకులు తక్కువగా చూశారని, రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దమన్నారు. బీజేపీ గెలుపును ఏశక్తి ఆపలేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. భువనగిరి కోటపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి చాడ సురే్షరెడ్డి, నాయకులు గూడూరు నారాయణరెడ్డి, బందారపు లింగస్వామి, దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, రమనగోని శంకర్, పి.శ్రీధర్ బాబు, బత్తుల జంగయ్య, కంచర్ల గోవర్థన్రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ విజయసంకల్ప సభను విజయవంతం చేయాలి
చౌటుప్పల్ మునిసిపాలిటీలో ఈ నెల 6న నిర్వహించే బీజేపీ జా తీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని బూర నర్సయ్యగౌడ్, పార్లమెంట్ పొలిటికల్ ఇన్చార్జి చాడ సురే్షరెడ్డి కోరారు. జేపీ నడ్డా ఎన్నికల విజయ సంకల్పసభను నిర్వహించే ఎంఎం రెడ్డి స్టేడియాన్ని పరిశీలించారు.
బీజేవైఎం కార్యకర్తలు మోదీ సైనికులుగా పని చేయాలి
నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి మురళీధర్రావు కోరారు. చౌటుప్పల్ పట్టణంలో శనివారం బీజేవైఎం యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ, మోదీ గ్యారంటీ పేరిట 10 హామీలను అమలు చేసేందుకు బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో బూర నర్సయ్యగౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్, నాయకులు అంబటి తరుణ్రెడ్డి, పవన్ రెడ్డి, సతీష్, దిండు భాస్కర్, పబ్బు వంశీ, చింతకింది కిషోర్, వినయ్ రెడ్డి, నరేష్, వెంకటేశ్ పాల్గొన్నారు.