చెన్నంపల్లిలో హత్య
ABN , Publish Date - May 03 , 2024 | 11:29 PM
మామిడి కాయల గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వ్యక్తిని గొడ్డలితో నరికిచంపిన దుండగుడు
లింగాల, మే 3: మామిడి కాయల గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లికి చెందిన అతికారి మల్లాజీ(40) అన్న శ్రీనివాస్కు చెన్నంపల్లి, ఎర్రపెంట మధ్యలో మామిడి తోట ఉంది. దానిని కొల్లాపూర్కు చెందిన వ్యక్తికి లీజుకిచ్చాడు. శ్రీనివాస్ అచ్చంపేటలో ఉంటుండటంతో మల్లాజీ తోటను చూసుకునేవాడు. కాగా తోటకు కొద్ది దూరంలో చెన్నంపల్లికి చెందిన లక్ష్మీశంకర్ చిన్నపాటి గుడారం వేసుకొని మేకలను ఉంచుతున్నాడు. అయితే లక్ష్మీశంకర్ తరచుగా మామిడి తోటలో కాయలను తెంపడం మల్లాజీ గమనించాడు. ఈ విషయమై వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం మల్లాజీ ద్విచక్ర వాహనంపై లీజుకు తీసుకున్న వ్యక్తిని తోట దగ్గర వదిలి, తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో మల్లాజీకి, లక్ష్మీశంకర్కు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మల్లాజీ ఇంటికి వెళ్తుండగా లక్ష్మీశంకర్ చేతిలో ఉన్న గొడ్డలితో వెనుక నుంచి తలపై బలంగా నరకడంతో మల్లాజీ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోయాడు. మల్లాజీ భార్య మమత కుటుంబ కలహాల కారణంగా కొన్ని నెలలుగా తల్లిగారి ఊరు తెలకపల్లి మండలం రాయిపాకులలో ఉంటోంది. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని అచ్చంపేట సీఐ రవీందర్, ఎస్ఐ జగన్మోహన్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.