జాగ్రత్తగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ABN , Publish Date - May 03 , 2024 | 11:18 PM
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు.
- జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మే 3 : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గద్వాల నియోజకవర్గం, డీపీఆర్వో కార్యాలయంలో ఆలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ర్టేషన్, ఓటరు రిజిస్ర్టేషన్ రిజిస్టర్లను, ఓటింగ్ సరళిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుంచి మే ఎనిమిది వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా, సాఫీగా జరిగేలా జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.
అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు 20 మంది ఉన్నందున, అదనంగా 888 బ్యాలెట్ యూనిట్లు అవసరమని తెలిపారు. గద్వాల నియోజక వర్గానికి 378, అలంపూర్ నియోజకవర్గానికి 363, మొత్తం 741 బ్యాలెట్ యూనిట్లను కేటాయించామని, మిగిలిన యూనిట్లను రిజర్వ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్, ఎన్నికల సూపరింటెండెంట్ నరేశ్, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.