ఓట్ల పండగకు నేడు శ్రీకారం
ABN , Publish Date - May 05 , 2024 | 12:05 AM
సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్ కదా... ముందే ఓట్ల పండుగ ఏమిటని ఆశ్చర్యపో తున్నా రా? అవును.. ఓట్ల పండగ ఆదివారం నుంచి మొదలవు తున్నట్టే. ప్రతి ఎన్నికలలోనూ ఇది మామూలే.
- పోస్టల్ బ్యాలెట్ వినియోగం
- ఓట్లు వేయనున్న ఎన్నికల సిబ్బంది
- 13న సాధారణ ఓటర్లకు అవకాశం
సాలూరు రూరల్, మే 4: సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్ కదా... ముందే ఓట్ల పండుగ ఏమిటని ఆశ్చర్యపో తున్నా రా? అవును.. ఓట్ల పండగ ఆదివారం నుంచి మొదలవు తున్నట్టే. ప్రతి ఎన్నికలలోనూ ఇది మామూలే. ఎన్నికల కమిషన్ ప్రకటించిన సాధారణ పోలింగ్ తేదీ కంటే ముందే ఎన్నికల సిబ్బంది తమ ఓటును వేయనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1031 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేష న్లలో ఎన్నికల నిర్వహణకు పీవోలు, ఏపీవోలు, అదర్ పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. వారితో పాటు భద్రతకు పోలీసులు.. ఎన్నికల సామగ్రి తీసు కెళ్లడానికి వచ్చే వాహనాల డ్రైవర్లు తదితరులు ఉంటారు. వారంతా తమ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి వీలు కాదు. వారికి పోస్టల్ బ్యాలెట్ అందించారు. ఈ ఓటు కోసం ఫారం 12 అందజేశారు. వారందరికీ ఫారం 13ఏ, 13బీ, 13సీ అందించి ఓటు వేయించనున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల కౌంటింగ్ తేదీకి ఒక రోజు ముందు వరకు అందించే సౌకర్యం ఉండేది. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చారు. పోస్టల్ బ్యాలెట్ను నియోజకవర్గ ఆర్వోలు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కౌంటర్లలో వేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉన్న ఎన్నికల సిబ్బంది తాము పని చేస్తున్న నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అదే ఇతర జిల్లాల్లో ఓటు ఉంటూ.. ఈ జిల్లాలో పనిచేసే ఎన్నికల సిబ్బంది జిల్లా ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలలోగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల సిబ్బంది ఓటు వేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని నియోజకవర్గాల ఆర్వోల ప్రకటనలు సైతం జారీ చేశారు.
జిల్లాలో ఫెసిలిటేషన్ కేంద్రాలివీ
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పార్వతీపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కురుపాంలో ఏపీ మోడల్ స్కూల్, పాలకొండలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉండి పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఓటు వేయడానికి పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
జాగ్రత్తగా వేయాలి
పోస్టల్ బ్యాలెట్లో ఓటును ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచన పత్రం పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్లు 2019లో రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం తిరస్కరణకు గురయ్యాయి. ఓటు వేయడంలో జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్ ఇలా ...
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రతి ఓటరుకు ఫారమ్ 13ఏ డిక్లరేషన్ ఫారమ్, 13 బీ, 13సీ కవర్లు అందిస్తారు. 13డీ సూచనలతో కూడిన ఫారమ్ అందిస్తారు. అసెంబ్లీకి గులాబీ బ్యాలెట్ పత్రం, లోక్సభకు తెలుపు బ్యాలెట్ పత్రం అందిస్తారు. బ్యాలెట్ పత్రంలో తమ ఓటును నచ్చిన అభ్యర్థి ఎదురుగా ఉన్న పార్టీ గుర్తుకు పక్కనే ఇచ్చిన ఖాళీ ప్రదేశంలో టిక్, లేదా క్రాస్ (ఇంటు) రూపంలో నమోదు చేయవచ్చు. దానిపై ఎటువంటి సంతకం, గుర్తు, బిందువు, సూచిక ఇతర చిహ్నం వంటివి రాయరాదు. ఫారమ్ 13ఎ డిక్లరేషన్లో బ్యాలెట్ వరుస నెంబరు తప్పకుండా రాయాలి. సంతకం చేయాలి. ఆ డిక్లరేషన్ వద్ద ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఉన్న గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాలి. బ్యాలెట్ పత్రాన్ని, ఫారం బి కవర్లో పెట్టి అతికించాలి. లోపలి కవర్పై అసెంబ్లీ ఆర్వో అడ్రస్, బ్యాలెట్ వరుస సంఖ్య రాయాలి. డిక్లరేషన్, బ్యాలెట్ ఉంచిన కవర్ను ఫారం-సీ కవర్లో విడివిడిగా ఉంచి అతికించాలి. కవర్పై సంతకం చేయాలి. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయాలి.