పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి: కలెక్టర్
ABN , Publish Date - May 04 , 2024 | 11:54 PM
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు జిల్లాలో ఓటు ఉంటే వారి సొంత నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, మే4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు జిల్లాలో ఓటు ఉంటే వారి సొంత నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి.. ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 5, 6 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయొచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని కోరారు.
హోం ఓటింగ్కు దరఖాస్తులు
పార్వతీపురం, మే4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వృద్ధులు, దివ్యాంగుల నుంచి హోం ఓటింగ్కు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ‘మన్యం’లో 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 3,900 మంది ఉండగా.. 270 మంది , 12,247 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా 383 మంది హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
ఫెసిలిటేషన్ సెంటర్ల పరిశీలన
పాలకొండ: పోస్టల్ బ్యాలెట్ కోసం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఐదు ఫెసిలిటేషన్ సెంటర్లను శనివారం పాలకొండ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఐటీడీఏ పీవో శుభం బన్సాల్ పరిశీలించారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు , ఉదయం ఏడు గంటల నుంచి సాయం త్రం ఐదు గంటల మధ్యలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఓటరు కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. 5న పీవో, ఏపీవో, ఓపీవోలు, 6న పోలీస్ సిబ్బంది, 7న బీఎల్వోలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.