Share News

వైసీపీ పాలనపై అంతటా అసంతృప్తే

ABN , Publish Date - May 04 , 2024 | 11:43 PM

‘వైసీపీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి నాశనం చేశారు. టీడీపీతోనే రాష్ట్రానికి పూర్వవైభవం సాధ్యమ’ని సినీహీరో, టీడీపీ నాయకుడు నారా రోహిత్‌ అన్నారు.

వైసీపీ పాలనపై అంతటా అసంతృప్తే
నర్సింగపురంలో ఎన్నికల ప్రచారంలో నారా రోహిత్‌, గౌతు శిరీష

- టీడీపీతోనే రాష్ట్రానికి పూర్వవైభవం

- సినీ హీరో నారా రోహిత్‌

పలాస/ హరిపురం, మే 4: ‘వైసీపీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి నాశనం చేశారు. టీడీపీతోనే రాష్ట్రానికి పూర్వవైభవం సాధ్యమ’ని సినీహీరో, టీడీపీ నాయకుడు నారా రోహిత్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పలాస నియోజకవర్గంలో పర్యటించారు. మందస మండలం నర్సింగపురంలో పలాస టీడీపీ అభర్థి గౌతు శిరీషతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ నాయకులతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అలాగే పలాస టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీని సాగనంపి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘వైసీపీ పాలనలో యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగావకాశాలు లేవు. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఉపాధి కోసం చాలా మంది యువత హైదరబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై తదితర రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది’ అని రోహిత్‌ ఆరోపించారు. విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పగిస్తే.. సంక్షేమ పాలన, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. యువతకు మేలు జరుగుతుందన్నారు. యువత భవిష్యత్‌ కోసం చంద్రబాబును సీఎంను చేయాలని కోరారు. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష మాట్లాడుతూ.. ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు అనే నినాదంతో ముందుకెళ్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీవించి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, జీకే నాయుడు, వి మాధవరావు, కర్రయ్య, రట్టి లింగరాజు, రుద్రయ్యలతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:43 PM