Share News

వైసీపీ నేతల బాహాబాహీ

ABN , Publish Date - May 05 , 2024 | 12:31 AM

సూళ్లూరుపేట ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సమక్షంలోనే వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి.

 వైసీపీ నేతల బాహాబాహీ

ఓజిలి, మే 4 : సూళ్లూరుపేట ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సమక్షంలోనే వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి.రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు.ఓజిలి మండలం మాచవరంలో శనివారం ఎన్నికల ప్రచారం నిమిత్తం కిలివేటి సంజీవయ్య వచ్చారు. గ్రామానికి చెందిన వైసీపీ నేతలు పి.పుల్లారెడ్డి, మధురెడ్డి మధ్య దీర్ఘకాలంగా వర్గ విభేదాలున్నాయి.కిలివేటి సంజీవయ్య రాక సందర్భంగా తాము సూచించిన మార్గంలోనే ప్రచారం మొదలు పెట్టాలంటూ ఇద్దరు నాయకులూ పట్టుబట్టారు.ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా మాటామాట పెరిగింది.కిలివేటి సర్దిచెపుతున్నా వినిపించుకోలేదు.ఇద్దరి అనుచరులూ పోటాపోటీ నినాదాలు చేశారు. ఇది కాస్తా శృతిమించి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న కిలివేటి ఇద్దరు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రచారం నిర్వహించకుండానే కారెక్కి వెనుదిరిగారు. నిజానికి సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో కుమ్ములాటలు రోజూ ఎక్కడో ఒక చోట బహిర్గతమవుతూనే వున్నాయి. గత నెలలో కిలివేటి నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సూళ్లూరుపేట వైసీపీ పట్టణాధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. వర్గ విభేదాలతోపాటు పెళ్లకూరు మండలంలో కొన్ని చోట్ల జనం సైతం నిలదీసిన ఘటనలున్నాయి.వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో వీధి కొట్లాటలకు దిగుతున్న నాయకులు వైసీపీని పుట్టిముంచేస్తారేమోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Updated Date - May 05 , 2024 | 12:31 AM