పార్టీ జెండా కట్టాడని టీడీపీ కార్యకర్తపై వైసీపీ దాడి
ABN , Publish Date - May 05 , 2024 | 12:25 AM
సొంత ఇంటిపై పార్టీ జెండా కట్టుకుంటే సహించలేకపోతున్నాయి అధికార పార్టీ శ్రేణులు. దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కుప్పం, మే 4: సొంత ఇంటిపై పార్టీ జెండా కట్టుకుంటే సహించలేకపోతున్నాయి అధికార పార్టీ శ్రేణులు. దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుప్పం మండలం మోట్లచేను గ్రామంలో శేఖర్ అనే టీడీపీ కార్యకర్త తన ఇంటిపై పార్టీ జెండా కట్టుకున్నారు. శనివారం కొందరు వైసీపీ నాయకులు ఆయన ఇంటికొచ్చారు. తమ పార్టీ ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. ఇంటిపై టీడీపీ జెండాను తొలగించాలని ఆదేశించారు. వారి మాటలను వినకపోవడంతో గ్రామ శివార్లలోని తైలం చెట్ల తోటలోకి శేఖర్ను తీసుకెళ్లి దాడిచేసి గాయపరిచారు. ఇంటిమీద టీడీపీ జెండా ఎగిరితే ప్రాణం తీస్తామని బెదిరించారు. తీవ్ర గాయాలతో ఉన్న శేఖర్ను కుటుంబ సభ్యులు చికిత్స కోసం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ మండలాధ్యక్షుడు ప్రేమ్కుమార్ తదితరులు పరామర్శించారు. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శేఖర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శేఖర్ కుటుంబ సభ్యులు కుప్పం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.