కత్తులతో యువకుల వీరంగం
ABN , Publish Date - May 05 , 2024 | 12:33 AM
కేవీబీపురం మండలం అంజూరు గ్రామంలో శ్రీకాళహస్తికి చెందిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో హల్చల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు.
కేవీబీపురం, మే 4 : కేవీబీపురం మండలం అంజూరు గ్రామంలో శ్రీకాళహస్తికి చెందిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో హల్చల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. తాము వెంబడించి ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా ముగ్గురు పరారైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పాత గొడవల నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హతమార్చేందుకు వచ్చిన కిరాయి మూకలుగా అనుమానిస్తున్నారు.ఏఎ్సఐ కథనం మేరకు....అంజూరుకు చెందిన ధనశేఖర్, వెంకటేశులు మధ్య మూడు నెలల క్రితం భూవివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ధనశేఖర్పై వెంకటేశులు వర్గం దాడికి ప్రయత్నించగా ఇరు వర్గాలూ పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.దీంతో ఇరువర్గాల పైనా హత్యయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ధనశేఖర్కు సంబంధించిన వ్యక్తులు శ్రీకాళహస్తి నుంచి అంజూరుకు చేరుకుని కత్తులతో హల్చల్ సృష్టించారు. వెంకటేశులుపై దాడికి ప్రయత్నించగా గమనించిన గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వారు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి ఇద్దరిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు.గట్టిగా ప్రశ్నిస్తే ధనశేఖర్ పంపితే వచ్చామని తెలిపారు. పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.