హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు : వైసీపీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-30T00:04:12+05:30 IST
న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అసభ్య పోస్టులు పెట్టిన సుమోటో కేసుపై ఇవాళ కొత్తగా
విశాఖపట్నం : న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అసభ్య పోస్టులు పెట్టిన సుమోటో కేసుపై ఇవాళ కొత్తగా మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 49 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన కోర్టు తాజాగా.. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, ప్రసాద్రెడ్డికి నోటీసులిచ్చారని వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ వ్యవహారంపై అమర్నాథ్ స్పందించారు. ‘నాకు హైకోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదు. పత్రికలు పాత్రికేయ మిత్రులు ద్వారా సమాచారం అందింది. నాకు నోటీసులు అందిన తర్వాత నే స్పందిస్తాను’ అని అమర్ మీడియాకు వివరించారు.
ప్రతి తీర్పును సమర్థించాల్సిన అక్కర్లేదు..!
‘గత నెల రోజులు క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై రమేష్ కుమార్కు మద్దతుగా టీడీపీ, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేశాయి. ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పని చెయ్యాలి.. కానీ నిమ్మగడ్డ మాత్రం పక్షపాతధోరణితో వ్యవహరించారు. న్యాయస్థానాలు అంటే మాకు.. మా పార్టీకు గౌరవం ఉంది. అలా అని న్యాయస్థానం ఇచ్చే ప్రతి తీర్పును సమర్ధించాల్సిన అవసరం మాకు లేదు. స్వయానా నిమ్మగడ్డ పీఏ వాంగ్మూలం ఇచ్చారు.. సొంత ఎజెండాలతో, పార్టీలు ఎజెండాలతో ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించకూడదు. హైకోర్ట్ తీర్పు వైసీపీకి అనుకూలంగా రానంత మాత్రాన న్యాయస్థానాల పట్ల గౌరవం తగ్గదు. ఒక వేళ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో మాకు అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం. అంతే కానీ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేదని కాదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట’ అని గుడివాడ అమర్ ఆరోపణలు చేశారు.