KCR కథ.. 3 ఏళ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరైంది: షర్మిల
ABN , First Publish Date - 2021-11-25T16:43:55+05:30 IST
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని ఎద్దేవా చేశారు. తాడోపేడో తేల్చుకుంటానని చెప్పాడన్నారు. మొత్తానికి KCR కథ 3 ఏళ్లు కర్రసాము నేర్చి మూలన కూర్చొన్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయిందంటూ సెటైర్ వేశారు. ‘‘3 గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన KCR కథ.. 3 ఏండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయింది.
ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు. అపాయింట్మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు? ఒక పక్క రైతులు కల్లాల్లో ధాన్యం పెట్టుకొని, వర్షానికి తడుస్తూ గుండెలు చెరువై కుప్పలపైనే ప్రాణాలు విడుస్తుంటే, మీ హుజురాబాద్ ఓటమిని జనాలు మర్చిపోవాలని, వరి కిరికిరి అని ధర్నా డ్రామాలతో ఢిల్లీ తీర్థ యాత్రలకు పోయింది చాలు. యాసంగి పక్కన పెట్టి కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనండి’’ అని షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు.