5 ఏళ్లకాల పరిమితిని ఇలాగే కొనసాగించాలని వైసీపీ ఆలోచన: జీవీఎల్
ABN , First Publish Date - 2022-02-03T03:22:07+05:30 IST
5 ఏళ్లకాల పరిమితిని ఇలాగే కొనసాగించాలని వైసీపీ ఆలోచన: జీవీఎల్
గుంటూరు: అమరావతిని అభివృద్ధి చేస్తారా లేదా అనేది ఇప్పుడున్న అంశమని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఐదేళ్ల కాల పరిమితిని ఇలాగే కొనసాగించాలని వైసీపీ ఆలోచన చేస్తోందని, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ABN డిబేట్లో జీవీఎల్ స్పష్టం చేశారు. ఎలాంటి మార్పులు చేసినా బీజేపీ క్షమించదని, రాష్ట్రాలకు ఎంత అప్పుచేసే అవకాశం ఉంటుందో కేంద్రం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. గతంలో పథకాలకు ఇచ్చిన నిధులను దారిమళ్లించేవారని, ఇప్పుడు ఆ అవకాశం లేదని ABN డిబేట్లో ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ అంకెల గారడీ ఇక సాగదని, ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ చూస్తోందని జీవీఎల్ అన్నారు. బీజేపీపై వైసీపీ విమర్శలు చేయకపోవడం ప్రణాళికలో భాగమే అనుకుంటున్నామని, తాను పార్టీ వాడినైనా ఏపీ ప్రయోజనాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నానని జీవీఎల్ తెలిపారు. వైసీపీ ఎంపీలు ఏపీ అభివృద్ధిపై కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరమన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఏపీకి మంచి చేయాలని అనుకుంటున్నానని, ఏపీలో బీజేపీ ఎదుగుతుందన్నప్పుడే వైసీపీకి ప్రత్యేక హోదా గుర్తుకువస్తుందని ఆయన విమర్శించారు. ఏపీ ప్రయోజనాల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులపై మా పోరాటమే కనిపిస్తోందన్నారు. పథకాల అమలు, అప్పులపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. ఎంపీ రఘురామ సహా బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, ఇది రాజకీయ ప్రముఖులందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అని ఎంపీ జీవీఎల్ అన్నారు.