పెద్దల సభకు ‘దువ్వాడ’ తగునా?

ABN , First Publish Date - 2021-02-27T19:59:12+05:30 IST

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ దువ్వాడ

పెద్దల సభకు ‘దువ్వాడ’ తగునా?

అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసరావును శాసనమండలికి పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. అసలు పెద్దల సభకు శ్రీనివాసరావు తగునా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రౌడీలా వ్యవహరించే శ్రీనివాస్ పెద్దల సభలో ఇక గద్డలా మారబోతున్నారా అనే చర్చ సాగుతోంది. పైకి సౌమ్యంగా కనిపించే శ్రీనివాస్ నోరు తెరిస్తే బూతులే. ఇక ప్రజల్లోకి వెళ్లాడంటే దూకుడే. ఒళ్లు తెలియకుండా మాట్లాడుతారు. అవతలి పార్టీ వారిని రెచ్చగొడుతాడు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని బెంబేలెత్తించే నైజం శ్రీనివాస్‌ది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో తాను ఎంత రౌడీనో చెప్పకనే చెప్పారు దువ్వాడ. వీరంగం సృష్టించాడు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా వైసీపీ అభ్యర్థిని నిలిపారు. అంతేనా టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలను కూడా ఎడాపెడా తిట్టారు. నిమ్మాడలో ఉద్రిక్తతకు కారణమయ్యారు. 


దువ్వాడ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన శ్రీనివాస్.. ఆ తర్వాత లాయర్ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా కొనసాగి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పీఆర్‌పీ తరపున టెక్కలి నుంచి పోటీ మూడో స్థానంలో నిలిచారు. 2009 తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు చేతిలో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు దువ్వాడకు వైసీపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రామ్మోహన్‌నాయుడు చేతిలో ఓటమి చెవిచూశారు. 13కు పైగా క్రిమినల్ కేసులున్న దువ్వాడకు ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు సీఎం జగన్. ఎమ్మెల్యే కోటాలో దువ్వాడ ఎన్నిక లాంఛనమే. అయితే క్రిమినల్ కేసులున్న దువ్వాడ పెద్దల సభకు తగునా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Updated Date - 2021-02-27T19:59:12+05:30 IST