భక్తజన సంద్రం.. యాదాద్రిక్షేత్రం
ABN , First Publish Date - 2021-10-18T02:06:55+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజనసంద్రాన్ని తలపించింది. దసరా సెలవులు ముగుస్తుండడం
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజనసంద్రాన్ని తలపించింది. దసరా సెలవులు ముగుస్తుండడం, వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో క్షేత్ర సందర్శనకు విచ్చేసి ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మ దర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాతగోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. కొండపైన తగినన్ని పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో భక్తుల వాహనాలను పోలీసులు కొండకింద తులసీకాటేజ్ ప్రాంతంలో పార్కింగ్ చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ఘాట్రోడ్లో, పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.20,31,973 ఆదాయం సమకూరింది.