యజమాని నిప్పంటించిన ఘటనలో మహిళా వాచ్మన్ మృతి
ABN , First Publish Date - 2021-04-13T14:26:32+05:30 IST
ఇంటి యజమాని కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో
హైదరాబాద్/కూకట్పల్లి : ఇంటి యజమాని కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో మహిళా వాచ్మన్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మహబూబ్నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన మునియమ్మ(28) కూకట్పల్లి బాలాజీనగర్లో వాచ్మన్గా పని చేస్తోంది. ఈ నెల 5న మునియమ్మ తన ఇంట్లోని బంగారు ఆభరణాలు దొంగిలించిందన్న నెపంతో ఇంటి ఓనర్ నాగసూర్యకుమారి, ఆమె కోడలు స్వాతి కలిసి నాలుగు రోజుల పాటు ఆమెను తీవ్రంగా వేధించారు.
తర్వాత సదరు గొలుసు ఓనర్ ఇంట్లోనే లభించినప్పటికీ, మునియమ్మపై కోపంతో ఉన్న నాగసూర్యకుమారి, స్వాతి గత శుక్రవారం కూడా వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో తలెత్తిన వివాదంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. శరీరంలో 90 శాతం గాయాలైన మునియమ్మ రెండు రోజుల పాటు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పోలీసులు నాగసూర్యకుమారి, స్వాతిపై ఐపీసీ 307 సెక్షన్ కింద గతంలో కేసు నమోదు చేయగా, ఇప్పుడు 302 సెక్షన్గా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింగ్రావు తెలిపారు.