తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-07-15T21:01:51+05:30 IST

వికారాబాద్ జిల్లా: తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది.

తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షలు ఇచ్చేందుకు తహసీల్దార్ ఏళ్ల తరబడి తిప్పించుకోవడాన్ని నిరసిస్తూ బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగింది. ఘనాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళ తన కుమార్తెతో కలిసి పెట్రోల్ వంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడున్నవారు అడ్డుకోవడంతో కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపింది.


భర్త చనిపోతే రైతు ఆర్థిక సహాయం కింద వచ్చిన డబ్బులు డ్రా చేయనియకుండా తహసీల్దార్ శ్రీనివాసరావు వేధిస్తున్నారని రాములమ్మ వాపోయింది. ఆమెకు ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. నిరసనలో పాల్గొన్నారు. శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.


ఘనాపూర్ గ్రామానికి చెందిన దండు సాయిలు అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో 2017న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జి పెట్టుకోగా 2019లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. చెక్ రూపంలో వచ్చిన డబ్బు మృతుని భార్య రాములమ్మ, కుల్కచర్ల తహసీల్దార్ పేరిట జాయింట్ అకౌంట్‌లో జమ అయింది. వాటితో గేదెలు కొని జీవనం కొనసాగిద్దామనుకున్న బాధిత కుటుంబానికి చుక్కెదురైంది. డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా వేధిస్తున్నారని వాపోయింది. కుటుంబ పరిస్థితి బాగోలేక, చేసేదేమీలేక తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు రాములమ్మ కన్నీరుమున్నీరయింది.

Updated Date - 2021-07-15T21:01:51+05:30 IST