మళ్లీ వస్తా.. ఎప్పుడైనా వస్తా..
ABN , First Publish Date - 2022-05-17T09:31:41+05:30 IST
‘తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వస్తూనే ఉంటా..’
బండికి అమిత్ షా ఫోన్!
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వస్తూనే ఉంటా..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కేంద్ర హోంమంత్రి అమిత్షా భరోసా ఇచ్చారు. ‘ఎన్నిసార్లయినా వస్తా.. ఎప్పుడైనా వస్తా...’ అని ప్రకటించారు. తుక్కుగూడలో రెండు రోజుల కిందట జరిగిన బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రెండోదశ ముగింపు సభకు అమిత్షా ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభ విజయవంతం కావడం, స్పందన కూడా అనూహ్యంగా ఉండటాన్ని ఆయన ప్రత్యక్షంగా గమనించారు. ఈ నేపథ్యంలో, సోమవారం బండి సంజయ్కి అమిత్ షా ఫోన్ చేసి మరోసారి అభినందనలు తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో మరోసారి పర్యటించాలని అమిత్షాను సంజయ్ ఆహ్వానించగా.. తప్పకుండా వస్తానని, ఎన్నిసార్లయినా వచ్చేందుకు సిద్ధమని ఆయన హామీ ఇచ్చారని తెలిపాయి. దీంతో మరో జిల్లాలో బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు బీజేపీ వర్గాలు వివరించాయి. పాదయాత్రలో పాలుపంచుకున్న ప్రతీ కార్యకర్తకూ అమిత్ షా అభినందనలు తెలిపారని వివరించాయి.
25న కరీంనగర్లో సంజయ్ హిందూ ఏక్తా యాత్ర
ఈ నెల 25న కరీంనగర్లో బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ రోజు నగరంలో భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు.